...
...
Next Story

తెలంగాణకు కేసీఆరే ఓజీ.. పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ కౌంటర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు కేసీఆరే ఓజీ అని, ఇక్కడ బయటి వ్యక్తుల జోక్యం సాగదని స్పష్టం చేశారు. అలాగే 2027లో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

Published on: Jun 3, 2026, 13:03:16 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను కేసీఆర్ చూసుకుంటారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమాజిగూడలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ.. తెలంగాణకు కేసీఆరే ఓజీ(Original Gangster) అని అభివర్ణించారు.

కేటీఆర్
కేటీఆర్

తెలంగాణలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, గతంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేసిందని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్షా కాదని.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి, త్యాగాలు చేసి, రక్తం చిందించిన ఇక్కడి ప్రజలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 'తెలంగాణ అనేది ఇక్కడి నాలుగు కోట్ల ప్రజల భూమి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారిది.' అని ఆయన అన్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థిరపడిన వారెవరూ ఎలాంటి వివక్షను ఎదుర్కోలేదని చెప్తూ.. ఏ ప్రాంతానికి చెందిన వారైనా తెలంగాణలో నివసించవచ్చని, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చని, అందరికీ ఇక్కడ స్వాగతం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రాంతీయతత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తప్పుపట్టిన కేటీఆర్.. భారతదేశ చరిత్రలో ప్రాంతీయ ఆకాంక్షలు ఎప్పుడూ కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. నాడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం స్వాతంత్య్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదాహరణగా పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, ఒక నటుడిగా తాము గౌరవిస్తామని చెప్తూనే.. తెలంగాణ అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని ఇక్కడి ప్రజలు అస్సలు సహించబోరని కేటీఆర్ హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ఉందన్న కేటీఆర్.. అయితే నాయకులు రాష్ట్రంపై వ్యాఖ్యలు చేసే ముందు ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, సెంటిమెంట్లు, త్యాగాలను అర్థం చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ అంత తేలికగా ఏర్పడలేదని, దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు కేటీఆర్. 2027 సంవత్సరంలో తాను రాష్ట్రవ్యాప్తంగా 'పాదయాత్ర' చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe