మేడారం మహాజాతర ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.. వనదేవతల దర్శనానికి ప్లాన్ చేసుకోండి!

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ఇప్పటికే చాలా మంది వెళ్తున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు జనాలు తరలివస్తున్నారు. ఈ ఏడాది సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సంబంధించి ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.

Published on: Jan 13, 2026 11:36 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మేడారం మహాజాతర 2026 కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతరకు ముందే మేడారం కిక్కిరిసిపోతోంది. మేడారం జాతర గురించి ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే.. దానికి తగ్గట్టుగా ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. 2026లో మేడారం మహాజాతర జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది.

మేడారం జాతర తేదీలు
మేడారం జాతర తేదీలు

మహాజాతర ముఖ్యమైన తేదీలు

  • జనవరి 14 - గుడిమేలిగే పండుగ
  • జనవరి 21 - మండమెలిగే పండుగ
  • జనవరి 27 - మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. ఇదే రోజు తాడ్వాయి మండలంలో కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారం గద్దెకు చేరుకుంటారు
  • జనవరి 28 - కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలో గల కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు
  • జనవరి 29 - వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి చేరుకుంటారు
  • జనవరి 30 - భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు
  • జనవరి 31 - దేవతల వన ప్రవేశం
  • ఫిబ్రవరి 4 - తిరుగువారం పండుగ, మహా జాతర ఉత్సవాల ముగింపు ఉంటుంది.

మేడారంలో కేబినెట్ భేటీ

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. ఈసారి భిన్నంగా మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టుగా సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పలు కార్యక్రమాల్లో హాజరు అవుతారు. సాయంత్రం మంత్రులతో కలిసి మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రోజున అంటే జనవరి 19వ తేదీన ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత.. హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి తిరుగుపయనం అవుతారు.