ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమేనా..? - కేటీఆర్
ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇళ్లు కూల్చడమా.? అని ప్రశ్నించారు.నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మం పట్టణం పరిధిలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిన ఇండ్లను కేటీఆర్ పరిశీలించారు. గురువారం బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా మంది బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ఖాళీ చేయించిందని వారు వాపోయారు.

ఇళ్లను కూలగొట్టడం అన్యాయం - కేటీఆర్
బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన "ఇందిరమ్మ రాజ్యం"లో… ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు మరియు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని విమర్శించారు.
ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్నగర్లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. కేవలం ఆర్డీవోను బదిలీ చేస్తే సరిపోదని…. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
మీ తరపున పోరాడుతాం - కేటీఆర్ హామీ
"మీరు ఎవరూ అధైర్యపడకండి, ఏడవకండి.. మీ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది" అని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్, చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామని చెప్పారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పారని బాధితులతో కేటీఆర్ అన్నారు. బాధితులంతా ఐకమత్యంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం బాధితులను విడదీసే ప్రయత్నం చేస్తుందని…. కానీ అందరూ కలిసికట్టుగా ఉంటేనే విజయం సాధించగలమని కేటీఆర్ సూచించారు. అధికారులు మరియు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టపరమైన అన్ని ఆధారాలు బాధితుల వైపు ఉన్నాయని…. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

E-Paper












