మెుత్తానికి రైతు భరోసా నిధులకు లైన్ క్లియరైనట్టే.. ఆ తేదీలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు!
తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అతిత్వరలో డబ్బులు వేయనుందని తెలుస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు పెట్టుబడి సహాయ పథకమైన రైతు భరోసా కింద నిధులను 70 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగులో ఉన్న భూమి కచ్చితమైన విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి సర్వే పూర్తి కాకపోవడం సహా వివిధ కారణాల వల్ల ఈ సీజన్లో నిధుల జమ కొన్ని వారాలు ఆలస్యమైంది. సర్వే పూర్తయినట్లు సమాచారం అందడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలు ముగిసిన వెంటనే నిధుల జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు.

ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫలితాలు ఫిబ్రవరి 13న ప్రకటిస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీలు వేగంగా సమీపిస్తుండటంతో రైతు భరోసా కోసం అవసరమైన రూ.9,000 కోట్ల నిధులను సమీకరించడానికి ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా ప్రక్రియను ప్రారంభించింది. మంగళవారం చేపట్టే సెక్యూరిటీల వేలంలో రూ.9,000 కోట్లు సమీకరించడానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక ఇండెంట్ సమర్పించింది.
ఇటీవలి సంవత్సరాలలో సమీకరిస్తున్న మొత్తం నిధులలో ఇది అత్యధికం. ప్రభుత్వం 13, 16 సంవత్సరాల కాలపరిమితితో ఒక్కొక్కటి రూ.2,000 కోట్లు, 21, 27 సంవత్సరాల కాలపరిమితితో ఒక్కొక్కటి రూ.2,500 కోట్లు చొప్పున సమీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.71,400 కోట్లు సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో అనుమతించిన రూ.54,009 కోట్ల కంటే రూ.17,000 కోట్లు ఎక్కువ.
రాష్ట్రం అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలతో మార్చుకోవాలని నిర్ణయించిన తర్వాత అదనపు రుణాలకు అనుమతి లభించింది. దీనిలో భాగంగా సుమారు 11 శాతం వడ్డీ ఉన్న రూ.26,000 కోట్ల రుణాలను సుమారు 7 శాతం వడ్డీ ఉన్న రుణాలతో తిరిగి చెల్లించడం ద్వారా ఖజానాపై భారం ఆదా అయింది.
ఇక ఇప్పుడు రైతు భరోసా డబ్బులు వేసందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిజానికి మున్సిపల్ ఎన్నికల కంటే ముందే 9 లేదంటే 10వ తేదీలోపు డబ్బులు పడతాయని అంతా అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగ సభలో త్వరలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు రైతు భరోసా నిధులు పడే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది.

E-Paper












