...
...
Next Story

మరో 100 కుక్కలను విషం ఇచ్చి చంపేశారు.. హైదరాబాద్‌ దగ్గరలోనే ఘటన

తెలంగాణలో కుక్కలను చంపుతున్న ఘటనలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Published on: Jan 21, 2026, 16:16:16 IST
Advertisement

జంతు ప్రేమికులు కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న వరుస సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుక్కలను వందల సంఖ్యలో చంపడంపై ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. మరోవైపు కుక్కలను చంపడం మాత్రం ఆపడం లేదు. హైదరాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని యాచారం గ్రామంలో 100 కుక్కలకు విషం ఇచ్చి చంపేసిన ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దీంతో స్థానిక సర్పంచ్, మరో ఇద్దరు పంచాయతీ ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వరుస వీధి కుక్కల హత్యలతో తెలంగాణలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జనవరి 6 నుండి అనేక జిల్లాల్లో దాదాపు 500 ఇలాంటి మరణాలు నమోదయ్యాయి.

స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక జంతు సంక్షేమ కార్యకర్త జనవరి 19న కుక్కలకు విషపూరిత పదార్థాన్ని ఇంజెక్ట్ చేశారని యాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యాచారం గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యుడిపై భారతీయ న్యాయ సంహిత, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు.

దాదాపు 100 కుక్కలు చంపినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక తనిఖీలో దాదాపు 50 జంతువులు చనిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, తదుపరి విచారణ తర్వాత కచ్చితమైన మరణాల సంఖ్యను చెబుతామని అధికారులు తెలిపారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వీధికుక్కల సమస్య నుంచి బయటపడేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత గెలిచిన సర్పంచ్‌లు ఈ మేరకు వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపుతున్నట్టుగా తెలుస్తోంది. అన్ని కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నాయని, బాధ్యులుగా తేలిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe