ఖమ్మంలోని వెలుగుమట్ల ఇళ్ల నిర్వాసితులకు ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి ఈనెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాలు కేటాయించనుంది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరాలను ప్రకటించారు.

ఆదివారం ఖమ్మం ఐడిఒసి వేదికగా వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. వెలుగుమట్ల భూముల విషయంలో పనిగట్టుకుని ఒకే కోణంలోనే కొన్ని పత్రికలు, ఛానల్స్ వార్తకథనాలను ప్రసారం చేశాయని... తప్ప నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. వాస్తవానికి వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, అప్పుల పాలై నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతను గ్రహించలేదని వ్యాఖ్యానించారు.
చాలా మంది పేదవాళ్లు రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించారని మంత్రి పొంగులేటి చెప్పారు. పట్టాలొస్తాయని నమ్మబలికి పేదలకు ఆశ చూపెట్టి దానినే ఆసరా చేసకుని నట్టేట ముంచారన్నారు. పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా కొందరు 4నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో వారంతా రోడ్డున పడ్డారన్నారు.
ఈనెల 15లోపు పట్టాలు - మంత్రి పొంగులేటి
బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి భరసానిచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను వంటి మౌళిక వసతులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. నియోజకవర్గాల వారిగా బాధితులను గుర్తించి... వారి వారి ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని తెలిపారు.