ఈ జిల్లాలో భారీగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. వెంటనే అప్లై చేయండి!
తెలంగాణలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాళీలను గుర్తిస్తోంది. కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జిల్లాలోని 11 ఐసీడీఎస్(ICDS) ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 178 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జులై 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే ఆరు జిల్లాల్లో ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా కొత్తగూడెం జిల్లాలో ఈ నోటిఫికేషన్ వెలువడింది. మిగిలిన జిల్లాల్లోనూ విడతల వారీగా త్వరలోనే విడివిడిగా నోటిఫికేషన్లు రానున్నాయి.
ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ప్రాజెక్టులలో పోస్టులు చూసుకుంటే.. మణుగూరు 24, పాల్వంచ 29, ఇల్లెందు 21, టేకులపల్లి 19, దమ్మపేట 16, కొత్తగూడెం 16, చర్ల 12, దుమ్ముగూడెం 12, అశ్వారావుపేట 11, బూర్గంపాడు 10, చంద్రుగొండ 08 ఉన్నాయి.
అర్హతలు
అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ఒకవేళ ఇంటర్ చదివిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే పదో తరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వినికిడి పరికరాలు ఉపయోగించి వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా నిలదొక్కుకోగలిగే అంధత్వం ఉన్నవారు, పిల్లలను సంరక్షించగల సామర్థ్యం ఉన్న దివ్యాంగ మహిళలు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా స్థానిక నివాసి అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల వారైతే సంబంధిత వార్డులో, గ్రామీణ ప్రాంతాల వారైతే అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలి. గిరిజన/ఆదివాసీ తండాలు మరియు గూడేలలోని పోస్టులకు స్థానిక ఎస్టీ (ST) మహిళలు, ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ (SC) మహిళలు మాత్రమే అర్హులు.
జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ (DSC) ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. వెయిటేజీ మార్కుల వివరాలు చూసుకుంటే.. ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం, అనాథలకు 10 శాతం, వితంతువులకు 5 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఇంటర్వ్యూ మార్కులు 10 మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ: 18.07.2026
సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ: జులై 20 నుండి ఆగస్టు 07, 2026 వరకు
అప్లోడ్ చేయాల్సిన పత్రాలు
అర్హులైన మహిళా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సమయంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కులధృవీకరణ పత్రం, విద్యార్హతల మార్కుల లిస్ట్ (ఇంటర్/అంతకంటే ఎక్కువ), స్థానిక నివాస ప్రమాణ పత్రం అప్లోడ్ చేయాలి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు సదరం సర్టిఫికేట్, వితంతు/అనాథ ధృవీకరణ పత్రాలను జతపరచాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


