...
...
Next Story

Duddilla Sripada Rao : ప్రజల పక్షాన శ్రీపాద వాణి.. ప్రసంగాలకు అక్షర రూపం

Duddilla Sripada Rao : దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభాలో చేసిన ప్రసంగాలకు అక్షరం రూపం ఇచ్చారు. ప్రజల పక్షాన శ్రీపాద వాణి పేరుతో పుస్తకం మన ముందుకు వస్తుంది.

Published on: Sep 6, 2026, 15:44:46 IST
Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో శాసన సభా నిర్వహణలో తనదైన చెరగని ముద్ర వేసిన నాయకుడు, మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభా ప్రసంగాలు త్వరలోనే అక్షర రూపంలో మన ముందుకు రాబోతున్నాయి. సభా రికార్డుల్లో మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్రతిష్టాత్మక గ్రంథాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో అత్యున్నత ప్రమాణాలతో ముద్రిస్తోంది. ప్రజల పక్షాన శ్రీపాద వాణి పేరిట రూపొందిన ఈ ప్రసంగాల సంకలనాన్ని ఈ వర్షాకాలం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆవిష్కరించేందుకు ఎమెస్కో సన్నహాలు చేస్తోంది.

దుద్దిళ్ల  శ్రీపాదరావు
దుద్దిళ్ల శ్రీపాదరావు

నవంబర్ 6, 1937లో దుద్దిళ్ల రాధాకృష్ణయ్య, కమలాభాయి దంపతులకు జన్మించిన శ్రీపాదరావు, బి.ఎస్సీ, ఎల్.ఎల్.బి పట్టా అందుకున్నారు. తన స్వగ్రామం ధన్వాడకు వరుసగా మూడుసార్లు ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికై... గ్రామ స్థాయి నుంచి తన ప్రజాసేవను ప్రారంభించారు. తర్వాత మంథని భూతనఖా బ్యాంక్ చైర్మన్‌గా, మహాదేవ్‌పూర్ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేసి, 1983లో తొలిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1984, 1989లలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విప్‌గా, రీజనల్ టొబాకో బోర్డు సభ్యుడిగా, పలు అసెంబ్లీ కమిటీల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1991 ఆగష్టు 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై 1995, జనవరి 11 వరకు ఆ పదవికి గౌరవాన్ని తెచ్చారు.

చట్టసభల్లో ఆయన వినిపించిన ప్రతి ఉద్వేగభరిత, విషయపరిజ్ఞానంతో కూడిన ప్రసంగం ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి‘లో లభిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంత రైతాంగం ఎదుర్కొన్న సాగునీటి తిప్పలు, ఉత్తర తెలంగాణ కరువు మండలాల రోదనలు, దళిత బహుజన, నిరుపేద వర్గాల ఆవేదనను, నిరుద్యోగం, నక్సలైట్ సమస్యలను సభ ముందు ఉంచడంలో ఆయన చూపిన ధైర్యం, తెగువను ఈ సంకలనం కళ్ళకు కడుతుంది. రూల్ బుక్‌ను క్షుణ్ణంగా ఔపోసన పట్టిన మేధావిగా సభా నిబంధనలకు సంపూర్ణంగా కట్టుబడుతూనే, ఎంతటి బలమైన ప్రభుత్వాలనైనా నిలదీసిన తీరు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లు, రూలింగ్‌లపై ఆయన వెలువరించిన చారిత్రాత్మక తీర్పులు నేటికీ అసెంబ్లీ రికార్డుల్లో ప్రామాణికంగా నిలిచాయి.

శ్రీ పాదరావు తనయుడు డి. శ్రీధర్ బాబు ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన కూడా తండ్రిలాగే మృదుస్వభావంతో, విషయపరిజ్ఞానంతో ప్రజాసేవలో కొనసాగుతున్నారు. శ్రీపాద రావు ప్రసంగాలకు అక్షర రూపమిస్తూ ఎమెస్కో అందిస్తున్న ఈ ‘‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి’’ వర్తమాన శాసనసభ్యులకు, భవిష్యత్ యువ నాయకులకు, ప్రజాస్వామ్యంపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ఒక దిక్సూచిగా నిలవనుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe