రాజ్యసభ ఎన్నికలు : రేసులో ఉన్న నేతలెవరు..? ఏకగ్రీవమా..పోటీనా..!
తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా జారీ అయింది. అయితే ఈ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. త్వరలోనే 2 స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ రెండు స్థానాలకు దక్కించుకునేందుకు టీ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సంఖ్యాబలం పరంగా రెండు సీట్లు కూడా వారి ఖాతాలోకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వేళ బీఆర్ఎస్ బరిలో ఉంటే… ఏమైనా సమీకరణాలు మారుతాయా అనే చర్చ కూడా మొదలైంది.

కాంగ్రెస్ నుంచి ఎవరు..?
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), కేఆర్ సురేశ్ రెడ్డి (బీఆర్ఎస్ ) పదవీకాలం పూర్తి కానుంది. ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ 2 సీట్లు దాదాపుగా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు దక్కించునేందుకు పలువురు సీనియర్ నేతలు పావులు కదిపే పనిలో పడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…. కొంత మంది సీనియర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాజ్యసభ, ఎమ్మెల్సీతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ జరిగినప్పటికీ… కొంతమంది లీడర్లకు ఛాన్స్ దక్కలేదు. అయితే అలాంటి వారంతా…. ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీ అవుతుండగా… ఒక సీటు అభిషేక్ సింఘ్వీకే ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన ఎన్నిక కాగా… కేవలం రెండేళ్లు మాత్రం ఆయన పదవీలో ఉన్నారు. అయితే మరోసారి ఆయన పేరునే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించే అవకాశాలున్నాయి.
రేసులో సీనియర్ నేతలు….
ఇక పార్టీలో అత్యంత సీనియర్ నేతగా వీహెచ్ కూడా రాజ్యసభ సీటుపై ఆశలు పెంచుకున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గంతో పాటు సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. మరో సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత… ఆయనకు ఎలాంటి అవకాశం రాలేదు. దీంతో రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం కోటాలో జెట్టి కుసుమ కుమార్ పేరు తెరపైకి వస్తోంది. ఆయన తప్పకుండా అవకాశం ఇవ్వాలని ఇటీవలే జగ్గారెడ్డి కూడా ప్రతిపాదించారు. ఆయనకు కుదరకపోతే.. వీహెచ్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు సీనియర్ నేత కోదండ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వేం నరేందర్ రెడ్డి (ప్రభుత్వ సలహాదారు) పేరు కూడా తెరపైకి వస్తోంది. గతంలో కూడా ఆయన పేరు తెరపైకి వచ్చినప్పటికీ… వర్కౌట్ కాలేదు. ఇక సీనియర్ నేతలుగా పేరొందిన టి జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి పేర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న హర్కర వేణుగోపాల్, షబ్బీర్ అలీ కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఏకగ్రీవమవుతారా..?
ఈ రెండు స్థానాలకు జరిగే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉంటుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్కు ఒక స్థానం గెలుచుకునే బలం ఉంది. రెండో స్థానానికి ఇతరుల మద్దతు అవసరపడుతుంది. ఇక బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని బరిలో దించితే…. సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నా బీజేపీ…. ఏ పార్టీకీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఇక సీపీఐ, ఎంఐఎం… కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సంఖ్యా బలం పరంగా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా ఉంటే…. కాంగ్రెస్ ఖాతాలోకే ఈ రెండు సీట్లు వెళ్తాయి. ఇలా జరిగితే… ఎన్నిక లేకుండానే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంటుంది.
- రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ - 26 ఫిబ్రవరి 2026.
- నామినేషన్లకు చివరి తేదీ - 5 మార్చి 2026.
- నామినేషన్ల పరిశీలన - 6 మార్చి 2026.
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - 9 మార్చి 2026.
- పోలింగ్ తేదీ - 16 మార్చి(సోమవారం).
- పోలింగ్ సమయం - ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
- ఓట్ల లెక్కింపు - 16 మార్చి 2026.
- ఎన్నికల ప్రక్రియ పూర్తి - 20 మార్చి 2026.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

