Hyderabad Traffic : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికే స్టాప్!

Hyderabad Traffic : రంజాన్ మాసం చివరి శుక్రవారం(మార్చి 20) సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Published on: Mar 20, 2026 8:51 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంజాన్ మాసపు చివరి శుక్రవార ప్రార్థనలైన జుమ్మత్-ఉల్-విదా సందర్భంగా శుక్రవారం (మార్చి 20) నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. చార్మినార్ సమీపంలోని మక్కా మసీదుకు వెళ్లే ప్రధాన రహదారులను ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలకు మూసివేస్తారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసుల సూచనల ప్రకారం, నాయాపూల్ నుండి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. అలాగే నాగులచింత, షాలిబండ నుండి వచ్చే వాహనాలను హిమ్మత్‌పుర వద్ద హరిబౌలి, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. చౌక్ మైదాన్ నుండి వచ్చే ప్రయాణికులను కోట్లా అలీజా, మొఘల్‌పుర వైపు మళ్లిస్తారు, అలాగే మూసాబౌలి నుండి వచ్చే వారిని మోతీగల్లి వద్ద ఖిల్వత్ గ్రౌండ్, చుట్టుపక్కల మార్గాల వైపు మళ్లిస్తారు.

ఎతెబార్ చౌక్ నుండి గుల్జార్ హౌస్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మండి మీరాలం మార్కెట్, బీబీ బజార్ వైపు మళ్లిస్తారు. అలాగే మిట్టి కా షేర్ నుండి వచ్చే వాహనాలను ఘన్సీ బజార్ మీదుగా హైకోర్టు రోడ్డు, ఖిల్వత్ వైపు వెళ్తాయి. అవసరాన్ని బట్టి, APAT వైపు నుండి వచ్చే ట్రాఫిక్‌ను లక్కడ్ కోట్ వద్ద మండి మీరాలం మార్కెట్ వైపు మళ్లిస్తారు.

రద్దీని నియంత్రించేందుకు గాను గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీద్-ఉల్-అనామ్ గ్రౌండ్, చార్మినార్ బస్ టెర్మినల్, AU ఆసుపత్రి, ఖిల్వత్ గ్రౌండ్, చౌమహల్లా ప్యాలెస్ సమీపంలోని పాత పెన్షన్ కార్యాలయంతో సహా పలు ప్రదేశాల్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

ఈ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకు కూడా వర్తిస్తాయి. చార్మినార్ వైపు వెళ్లే నగర బస్సులు అఫ్జల్‌గంజ్ వద్దే ప్రయాణాన్ని ముగిస్తాయి. కాగా ఎంజీబీఎస్ నుండి జిల్లాలకు వెళ్లే బస్సులను చాదర్‌ఘాట్, సైదాబాద్, ఐఎస్ సదన్, ఒవైసీ ఆసుపత్రి, బండ్లగూడ, ఆరామ్‌ఘర్ మీదుగా మళ్లిస్తారు.

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

సికింద్రాబాద్‌లో మహంకాళి పోలీస్ స్టేషన్, పాత రామగోపాల్‌పేట జంక్షన్ మధ్య ఉన్న సుభాష్ రోడ్డు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మూసివేస్తారు. ఈ సమయంలో రాణిగంజ్, పారడైజ్ మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. బాటా కూడలి నుండి వచ్చే ట్రాఫిక్‌ను మహంకాళి పోలీస్ స్టేషన్ సమీపంలో లాలా టెంపుల్ వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా వేదికల ద్వారా ట్రాఫిక్ తాజా సమాచారాన్ని అనుసరించాలని, అత్యవసర పరిస్థితుల్లో 9010203626 నంబర్ ద్వారా ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More