ఆరు ప్రాణాలు తీసిన ఘటన.. చంపడానికి కొన్ని గంటల ముందు కన్న బిడ్డలతో క్రికెట్ ఆడిన నిందితుడు

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో ఆరుగురిని రాజ్ కుమార్ అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ముందు రాజ్ కుమార్ తన కన్నబిడ్డలతో క్రికెట్ ఆడాడు.

Published on: Jul 12, 2026, 19:06:02 IST
By , Rangareddy
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సమాజాన్ని నివ్వెరపరిచే అత్యంత అమానుషమైన, గుండెల్ని పిండేసే విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవలగూడ గ్రామంలో జరిగింది. ఒకే ఒక్క ఉన్మాద ఆలోచన.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. తన భార్య, ఇద్దరు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురిని కిరాతకంగా హతమార్చాడు పి.రాజ్‌కుమార్ అనే వ్యక్తి. ఈ దారుణానికి పాల్పడటానికి కొన్ని గంటల ముందు.. తన ఇద్దరు కొడుకులను హెయిర్‌కట్ కోసం బయటకు తీసుకెళ్లాడు. చంపడానికి కొన్ని గంటల ముందు కుమారులతో ఎంతో సరదాగా క్రికెట్ ఆడాడని స్థానికులు చెబుతూ.. కన్నీరుమున్నీరవుతున్నారు.

నిందితుడు రాజ్ కుమార్
నిందితుడు రాజ్ కుమార్

మే నెలలో 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించినందుకు గాను రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. ఆ కేసు పెట్టిన కుటుంబంపై పగ పెంచుకున్నాడు. జూలై 10 (శుక్రవారం) రాత్రి 11 గంటల ప్రాంతంలో దైవలగూడ గ్రామంలోని సదరు బాలిక ఇంటిపై రాజ్‌కుమార్ దాడి చేశాడు. మొదట ఇంట్లోకి చొరబడి బాలిక తల్లిని, అమ్మమ్మను అత్యంత దారుణంగా చంపేశాడు. మైనర్ బాలికను బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు వద్దకు తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత గొంతు కోసి చంపేశాడు.

ఆ ముగ్గురిని అంతం చేసిన రాజ్‌కుమార్ కారు నడుపుకుంటూ తిరిగి తన ఇంటికి వచ్చాడు. అక్కడ నిద్రిస్తున్న తన భార్య పార్వతి సరిత, వారి ఇద్దరు కొడుకులను (మూడేళ్లు, రెండేళ్ల వయసు) దారుణంగా చంపేశాడు. రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట మధ్య.. ఆరు హత్యలు చేశాడు రాజ్ కుమార్. తన తండ్రికి చేసిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. నేను ఆరు మందిని చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను.. అని చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.

రాజ్‌కుమార్ (35), సరితది 2018లో ప్రేమ వివాహం. వేర్వేరు కులాలైనప్పటికీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సరిత బీఈడీ పూర్తి చేసింది. ఇటీవలే ఉపాధ్యాయ అర్హత పరీక్షలో కూడా అర్హత సాధించింది. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంది. రాజ్‌కుమార్ కూడా ఇటీవలే మూడు ఎకరాల భూమిని ఎకరా రూ.1.3 కోట్ల చొప్పున విక్రయించాడు. డైరీ ఫామ్ ఏర్పాటు చేయడానికి షెడ్లు కూడా నిర్మించాడు. అంతా బాగుందనుకునే సమయంలో 2024 నుండి సదరు మైనర్ బాలికపై రాజ్‌కుమార్ కన్నుపడింది. దీంతో భార్య సరితను విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడం మెుదలుపెట్టాడు.

ఎఫ్ఐఆర్ (FIR) వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ గత ఏడాది కాలంగా ఆ బాలికను తీవ్రంగా వేధిస్తున్నాడు. కాలేజీకి వెళ్తుంటే అడ్డుపడటం, ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగేవాడు. భయపడిన బాలిక తల్లి తన కూతురిని ఆరు నెలల పాటు కాలేజీకి కూడా పంపకుండా ఇంట్లోనే ఉంచింది. వారి కదలికలను గమనించడానికి రాజ్‌కుమార్ తన ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చాడు. మే 16న బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసి కాలేజీ బయటకు రాగానే రాజ్‌కుమార్ ఆమె చేయి పట్టి లాగడానికి ప్రయత్నించాడు. తల్లి కాపాడుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోక్సో కేసు నమోదైంది. చివరకు ఆ కేసు పగగా మారింది. ఒకే రాత్రి ఆరు ప్రాణాలను బలితీసుకున్నది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More