తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మొత్తం 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీలకు కేటాయించగా…. 38 పీఠాలను బీసీలకు కేటాయించారు.

కీలకమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్ కు కేటాయించగా…గ్రేటర్ వరంగల్ జనరల్ గా నిర్ణయించారు. కరీంనగర్ కార్పొరేషన్- బీసీ జనరల్, కొత్తగూడెం కార్పొరేషన్- ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్- ఎస్సీ జనరల్కు కేటాయించారు.
- నల్గొండ కార్పొరేషన్-మహిళా జనరల్
- నిజామాబాద్ కార్పొరేషన్- మహిళా జనరల్
- మహబూబ్నగర్ కార్పొరేషన్- బీసీ మహిళ
- మంచిర్యాల కార్పొరేషన్- బీసీ జనరల్
- ఖమ్మం కార్పొరేషన్-మహిళా జనరల్
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం…. జీహెచ్ఎంసీ కార్పొరేషన్తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు, గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి రిజర్వ్ చేశారు.
కీలకమైన రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలు సంఘం ఏర్పాట్లపై దష్టిపెట్టింది. ఇటీవలనే మున్సిపల్ ఎన్నికల కోసం వార్డులవారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.
రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం… నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు కొత్తగూడెం కార్పొరేషన్లో ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోనూ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 56,664 మంది మహిళలు ఉన్నారు.