టెన్త్, ఐటీఐ అర్హతతో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్.. దక్షిణ మధ్య రైల్వేలో వెయ్యికిపైగా ఖాళీలు!
పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసినవారికి భారతీయ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువరించింది. మెుత్తం ఖాళీల్లో దక్షిణ మధ్య రైల్వేలో వెయ్యికిపైగా పోస్టులు ఉన్నాయి.
భారతీయ రైల్వే ఇటీవల పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మెుత్తం 22,195 గ్రూప్ డి ఖాళీలకు రిక్రూట్మెంట్ చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వే(సికింద్రాబాద్) జోన్లోనూ పోస్టులు ఉన్నాయి. గ్రూప్ డీ(లెవెల్ 1)కు సంబంధించి 1012 ఖాళీలను భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. పదో తరగతి/ఐటీఐ అర్హత ఉన్నవారి కోసం ఈ మేరకు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ చేస్తోంది.

పోస్టుల వివరాలు
గ్రూప్ డీ(లెవల్ 1) పోస్టులకు సంబంధించి పాయింట్స్మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు పలు విభాగాల్లో ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవవచ్చు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న మెుదలైంది. మార్చి2వ తేదీతో ముగియనుంది.
వయోపరిమితి
వయోపరిమితి విషయానికి వస్తే.. 01-01-2026 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు దొరుకుతుంది. ప్రారంభ వేతనం నెలకు రూ.18000 నుంచి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: 27.12.2025.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం తేదీ : 31.01.2026.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.03.2026.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు : 04.03.2026.
దరఖాస్తు సవరణ తేదీలు: 05.03.2026 నుంచి 14.03.2026.
ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు
అభ్యర్థులు ఎంపిక చేయడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత రిక్రూట్ చేసుకుంటారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500(CBT రాస్తే రూ.400 రీఫండ్). ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసిన తర్వాత పూర్తి రీఫండ్ చేస్తారు.

E-Paper












