తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి.. ఆర్మీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఆర్మీ, తెలంగాణ మధ్య ఉన్న వివిధ సమస్యలు నిరంతరం చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన 'సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్' జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ - ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.
దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు 3 వేల ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆర్మీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారం, చర్చలకు సంబంధించి ఆర్మీ వైపు నుంచి కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు.

E-Paper












