తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు : టీచర్లకు కూడా అల్పాహారం, భోజనం - 6,278 వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, వివరాలు

Telangana Cabinet Decisions 2026 : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం, టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీ, మూసీ ప్రాజెక్ట్ ఫేజ్-1కు రూ.7,345 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Published on: Jul 2, 2026, 22:22:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Cabinet Decisions 2026 : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని 1 లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం అమలు చేయాలని సమావేశం తీర్మానించింది. వీబీజీ రామ్‌జీ పథకంపై రాష్ట్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గ సమావేశం భావించింది.

కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు…

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకంపై గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సమావేశం సుధీర్ఘంగా చర్చించినట్టు వారు తెలిపారు.

నిరుపేదల హక్కుల హరించే విధంగా ఉన్న వీబీజీ రామ్‌జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యధాతథంగా అమలు చేస్తోందని అన్నారు. గత్యంతరంలేని, అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగొద్దని ఆ పథకాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని భావించినట్టు చెప్పారు.

  • కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
  • స‌న‌త్‌న‌గ‌ర్‌, ఎల్‌బీ న‌గ‌ర్‌, అల్వాల్ టిమ్స్‌తో పాటు వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియమించడానికి 6,278 పోస్టులు మంజూరు చేసింది.
  • ఈ ఆసుప‌త్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవ‌ల‌కు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి LOC లు జారీ చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ -1 లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేరకు పూర్తి చేయడానికి మంత్రిమండలి పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఫేజ్-1 ప్రాజెక్టు అబివృద్ధి కోసం రూ. 7,345 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రులు పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More