Hyderabad Musi River : మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం - నిర్మాణం ఎలా ఉండనుంది..? ప్రత్యేకతలు
Hyderabad Omkareshwara Temple:
మూసీ రివర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట - మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14 వందల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని…. 8 ఎకరాల్లో దాదాపు రూ. 700 కోట్లతో పునర్నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఎన్నో ప్రత్యేకతలు…
ఈ ఓంకారేశ్వర దేవాలయ నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ శివాలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ముందు భాగంలో 91 అడుగుల ఎత్తు, 9 అంతస్తుల్లో మహా రాజగోపురం నిర్మిస్తారు. ఆలయ సముదాయం 2 ప్రాకారాలతో, నాలుగు దిక్కుల 8 భారీ రాజ గోపురాలను ప్రతిష్టిస్తారు.
కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సూచనలతో ఆలయ నిర్మాణ శైలి ఖరారైంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో లలితామహాత్రిపురసుందరి, వీరభద్ర, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి ఉప ఆలయాలుంటాయి. ప్రధాన గర్భాలయం ఎత్తు 64 అడుగులుగా ఉండనుంది. 44 స్తంభాలతో మహా మండపం నిర్మాణం కానుంది. మూసీ నది మధ్యలో 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఏర్పాటు చేస్తారు.
- ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ పనులకు వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో మార్చి 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
- మూసీ నదీ తీరంలో నాలుగు మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను నిర్మించి.. అభివృద్ధి పనులను మత సామరస్యానికి ప్రతీకగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- మంచిరేవులలోని పురాతన వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయటంతో పాటు.. చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో వద్ద భారీ మసీదు, గౌలిగూడ వద్ద గురుద్వారా, ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మాణం చేపట్టనున్నారు.
- ఓంకారేశ్వర ఆలయానికి ఓఆర్ఆర్ నుంచి విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మించనున్నారు. ఆలయం వద్ద విశాలమైన వెకిహల్ పార్కింగ్ ఏరియా, దిగువనున్న మూసీపై చిన్నపాటి ఆనకట్టను నిర్మించి నీటిని నిల్వ చేయనున్నారు.
- నది మధ్యలో నిల్చున్న భంగిమలో ఏర్పాటు చేయబోయే శివుని విగ్రహం చుట్టూ పార్కులను అభివృద్ధి చేస్తారు. బోటింగ్, ఇతర సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది.
ఒకప్పుడు తెలంగాణలో నాగరికతకు జీవనాడిగా ఉన్న మూసీ నది ఉంది. కానీ దశాబ్దాల తరబడి నిర్లక్ష్యంతో పాటు కాలుష్యానికి గురైంది. ఇదే క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక నిర్మాణాలు వెలిశాయి. వీటిని పునరుద్ధరించడానికి గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ… విఫలమయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని అభివృద్ధి చేయాలని బలంగా భావిస్తోంది. గోదావరి జలాలను మూసీలో పారించేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
మూసీ రివర్ ఫ్రంట్ ను ఆర్థిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సర్కార్ భావిస్తోంది. పర్యావరణ సమస్యలకు కూడా చెక్ పెట్టాలని… మూసీ నుంచి వచ్చే కాల్యుష్య బారి నుంచి నల్గొండ జిల్లాను కాపాడాలని చూస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

