మూసీ ఒడ్డున భారీ ఓంకారేశ్వర ఆలయం - సీఎం రేవంత్ శంకుస్థాపన, నమూనా వీడియో విడుదల
Musi River Revitalization Project : మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణానికి డిజైన్ను మూసీ రివర్ఫ్రంట్ ఖరారు చేసింది. చారిత్రక వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించనున్నారు ఆలయంలో వంద అడుగుల గాలిగోపురాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన 3D నమూనా కూడా విడుదలైంది.

మూసీ ప్రక్షాళన చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ ప్రక్షాళన అత్యవసరమన్నారు. హైదరాబాద్ నుంచి కాలుష్యం మూసీ నదిలో కలుస్తోందని.. నల్గొండ వరకూ వెళ్తోందని చెప్పారు. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు చాలా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి ఈ ప్రాంతంలో ఉందన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలిస్తున్నామని…. మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదమని వ్యాఖ్యానించారు.
“మంచిరేవులలో, మూసీ నదీ తీరాన మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శుభ కార్యక్రమానికి భూమిపూజ చేశాను. ఈ మందిర పునర్ నిర్మాణం దైవ సంకల్పం. ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన” అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలని చాలా మంది ప్రయత్నించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదన్నారు. “విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడు. తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందింది. మూసీ పరివాహకంలో మతసామరస్యానికి చిహ్నంగా ఒక మసీదు, నాగోల్ ప్రాంతంలో ఒక చర్చిని నిర్మించబోతున్నాం. గోదావరి జలాలను తరలించి మూసీలో నిరంతరం నీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. మానవ తప్పిదాలను సరిద్దిద్దకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. మూసీ పరివాహక ప్రజాప్రతినిధులు మూసీ ప్రక్షాళన చెయ్యాల్సిందే అని రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో మూసీ ప్రక్షాళన చేస్తాం” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ స్పీచ్ - మరిన్ని అంశాలు:
- "మూసీ ప్రక్షాళన చేయడమన్నది ఇప్పుడు నిత్యావసర వస్తువులకన్నా అత్యవసరం. పరీవాహక ప్రాంతాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా, ప్రత్యేకమైన ధ్యానమందిరాలతో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయబోతున్నాం.
- చరిత్రను గమనించినప్పుడు నదీ పరీవాహన ప్రాంతాలు, సముద్ర తీరాల్లోని ప్రాంతాలు అభివృద్ధిని సాధించాయి. తెలంగాణ సముద్రతీరం లేని రాష్ట్రం. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఈసా నదులున్నా ఆ జలాలను సరిగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయాయి.
- దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంతో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రులు ఉండే ఢిల్లీలో యమునా నది కాలుష్యమై పారుతోంది. కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించడం, పెట్టుబడులు తరలిపోవడం వంటి పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉందా లేదా.
- హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. మూసీ ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ప్రాధాన్యత కలిగిన చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదును, గౌలిగూడ ప్రాంతంలో సిక్కు చరిత్ర ఉంది. స్వర్ణ దేవాలయంలాంటి దేవాలయం నిర్మాణం, ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో అద్భుతమైన చర్చి నిర్మించబోతున్నాం.
- ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ప్రాంత ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. కేసును ఉపసంహరించుకోవాలి" అని సీఎం రేవంత్ కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

