...
...
Next Story

MeeSeva WhatsApp : ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సేవలు మీ సేవ వాట్సాప్ ద్వారా పొందొచ్చు

MeeSeva WhatsApp : ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ల సేవలను మీ సేవ వాట్సాప్ ద్వారా అందిస్తోంది.

Published on: Apr 11, 2026, 07:12:42 IST
Advertisement

తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ESD) విభాగం, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ (IGRS) శాఖ సేవలను మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లోకి అనుసంధానించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కార్యాలయం ప్రకటించింది.

వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్ల సేవలు
వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్ల సేవలు

స్థిరాస్తులు, భూములకు సంబంధించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సేవలను ఇక వాట్సాప్ మీ సేవ ద్వారా పొందవచ్చు. డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో ఈ సేవలను తీసుకొచ్చినట్టుగా మీ సేవ కమిషనర్ రవికిరణ్ వెల్లడించారు.

అధికారిక మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా పలు రకాల ఐజీఆర్ఎస్ సేవలను పొందవచ్చు. రిజిస్ట్రేషన్ పత్రం ధృవీకరించిన కాపీ, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్, స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, లోటు, సొసైటీలు, ఆర్‌టీఐ, సంస్థలు, జరిమానా వంటి సేవలు ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐజీఆర్ఎస్ శాఖతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.

అవసరమైన ప్రభుత్వ సేవలకు నిరంతరాయంగా అందించే అదనపు డిజిటల్ మాధ్యమంగా మీసేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌ను నవంబర్ 18న ప్రారంభించినట్లు ప్రకటనలో తెలిపారు.

ఎలా వాడాలి?

  • 8096958096 వాట్సప్‌ నంబరును సేవ్‌ చేసుకోవాలి. Hi అనే మెసేజ్‌ సెండ్ చేయాలి.
  • వివరాలు నమోదుచేసి, ఫారమ్ నింపి పంపాలి.
  • ఆ తర్వాత ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన అనంతరం సేవలు పొందొచ్చు.
  • అపరాధ రుసుం చెల్లింపులు, డెఫిసిటీ వంటి సేవలకు సంబంధించి.. చెల్లింపు ప్రక్రియ తర్వాత సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పత్రాలు తీసుకోవాలి.
  • ఈసీ మాత్రం సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదం పొందిన అనంతరం సర్టిఫైడ్‌ ఈసీ కాపీ వాట్సప్‌లోనే వస్తుంది.
  • స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, సొసైటీలు, సమాచార హక్కు దరఖాస్తు(ఆర్టీఐ), ఫర్మ్‌లకు సంబంధించిన సేవలు కూడా మీ సేవ వాట్సాప్ ద్వారా పొందవచ్చు.

మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే ఇబ్బందులను వాట్సాప్ మీ సేవ పరిష్కరించింది. ఈ సేవలను నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందవచ్చు. పౌరులు ఇంటి వద్ద కూర్చొనే.. ఆదాయం, కులం, నివాసం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్లు, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లువంటివి ఫోన్ నుంచి దరఖాస్తు చేయవచ్చు. విద్యుత్, నీటి, ఆస్తి పన్ను చెల్లింపులు, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, దేవాలయాలు సేవలు పొందేలా కూడా ప్రభుత్వం ప్లానే చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe