బనకచర్లపై సుప్రీంలో తెలంగాణ సర్కార్ పిటిషన్ - ఈనెల 5న విచారణ

గోదావరి జలాల మళ్లింపును సవాల్ చేస్తూ పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్ (బనకచర్ల) పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిది.దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం జనవరి 5న విచారణ చేపట్టనుంది.

Published on: Jan 01, 2026 3:39 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

200 టీఎంసీల గోదావరి నదీ నీటిని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై జనవరి 5వ తేదీన విచారణ జరగనుంది.

పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)
పోలవరం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో)

గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని… ఈ పిటిషన్ పై జనవరి 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి లేదన్నారు. హరీశ్ చెప్పినవన్నీ అబద్ధాలేనని క్లారిటీ ఇచ్చారు.

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతిని నిలిపివేయడమే కాకుండా, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను(డీపీఆర్) తయారు చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు.

డిసెంబర్ 4, 2025 నాటికి… పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ యొక్క ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (పిఎఫ్ఆర్) కోసం సూత్రప్రాయంగా ఎటువంటి సమ్మతి ఇవ్వబడలేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

మరోవైపు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని హరీశ్ రావు మంగళవారం పిలుపునిచ్చారు. సీడబ్ల్యూసీ మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన చేపట్టాలని ఆయన సూచించారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరి నీటిని కృష్ణాకు బదిలీ చేస్తే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు 45:21:14 నిష్పత్తిలో నీరు రావాలని హరీశ్ రావు పేర్కొన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే.