తెలంగాణలో ప్రతీ గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్.. రింగ్ ఆర్కిటెక్చర్ విధానం!

తెలంగాణలో పటిష్టమైన ఫైబర్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మెుదలుపెట్టింది. టీ-ఫైబర్ నెట్‌వర్క్ త్వరలో రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనుంది.

Published on: May 28, 2026, 09:45:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంగా అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ సజావుగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతీ గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్
ప్రతీ గ్రామానికి హైస్పీడ్ ఇంటర్నెట్

ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి సాధ్యమైనంత తొందరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధులను సత్వరం విడుదల చేయడం వంటి అంశాలను ముఖ్యమంత్రి చర్చించారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో చర్చించారు.

మండలం నుండి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని కేంద్ర మంత్రిని కోరారు. వీటిపై సింధియా సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. తెలంగాణ ఆశిస్తున్న లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.

ABPలో భాగంగా తెలంగాణ ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం, తద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా విస్తృతమైన హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరుచుకోవడానికి వీలుంటుంది.

రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ విధానం వల్ల టీ ఫైబర్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూ ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానిస్తూ రింగ్ ఆర్కిటెక్చర్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో నెట్‌వర్క్‌ అంతరాయం ఏర్పడినా, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. తద్వారా గ్రామీణ తెలంగాణకు అంతరాయం లేకుండా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో, నెట్‌వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరిస్తారు. అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద గ్రామాలను అనుసంధానిస్తూనే, భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ నెట్ వర్క్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రంలోని హై-స్పీడ్ నెట్‌వర్క్ అందుతున్న ఇతర ప్రాంతాలకు సమంగా సేవలు అందించవచ్చు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ కె. రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More