Telangana Assembly Sessions : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - కీలక అంశాలపై చర్చకు ఛాన్స్..!

Telangana Assembly Sessions : ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పాలనలో 1,000 రోజుల పూర్తి, హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతుండగా… కేసీఆర్ హాజరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నాస్త్రాలను సంధించనున్నారు.

Published on: Sep 7, 2026, 05:12:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Assembly Sessions : తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి (సోమవారం) ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు అత్యంత వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పక్షం, మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ సభలోనే తేల్చుకునేందుకు వ్యూహాలు రచిస్తుండగా, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భారతీయ జనతా పార్టీ కూడా పావులు కదుపుతోంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సిద్ధమవుతున్న ప్రధాన పక్షాలు…

సభలో ఏ అంశంపైనా అయినా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 2023లో అధికారం కోల్పోయినప్పటి నుంచి బిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు కేవలం తన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, అసెంబ్లీకి గానీ, ప్రజల్లోకి గానీ రావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొలి 1,000 రోజుల పాలన, గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వైఫల్యాలను సభలో ఎండగడతామని ధీమా వ్యక్తం చేశారు.

శాసనసభకు రానప్పుడు ప్రతిపక్ష నేత పదవిలో కొనసాగడం సరికాదని…. కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ఇటీవలి బహిరంగ సభలో మాట్లాడిన సీఎం….. "గత 1,000 రోజుల్లో కేసీఆర్ జీతం కోసం రాష్ట్ర ఖజానా నుంచి రూ.1.24 కోట్లు, ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఇతర వసతుల కోసం రూ.21 కోట్లు ఖర్చు చేశాం," అని గణాంకాలతో సహా వెల్లడించారు. అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ రాజీనామా డిమాండ్‌ను బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు…. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై 'ఛార్జిషీట్' విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ తన కీలకమైన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైందని, అన్ని రంగాలు, పాలన పడకేసిందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ఈ 1,000 రోజుల కాంగ్రెస్ తుగ్లక్ పాలన వల్ల రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు," అని ఆయన ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, విద్యార్థులకు వాగ్దానం చేసిన రూ.5 లక్షల 'భరోసా' కార్డులు, పాఠశాలలు-కళాశాలలకు వెళ్లే బాలికలకు స్కూటర్ల పంపిణీ, పాలిటెక్నిక్ కళాశాలలను 'యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ'లో విలీనం చేయడం వంటి నెరవేర్చని హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అటు బీజేపీ కూడా సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో భారీగా భూములను చేర్చడం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను…. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరును సభలో లేవనెత్తాలని బీజేపీ భావిస్తోంది.

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. గత జులైలో నీట్ (NEET) అంశంపై ఢిల్లీలో సిజెపి చేపట్టిన నిరసనను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సును ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరుతూ ఈ సమావేశాల్లోనే శాసనసభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తామని వెల్లడించారు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో తొలిరోజే సభలో తీవ్ర గందరగోళం…. వాడీవేడి చర్చలు తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More