తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. సంతకం చేసి వెళ్లిపోయిన కేసీఆర్!
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈసారి ఎక్కువగా నీటిపారుదల సమస్యల మీద చర్చ జరగనుంది.
డిసెంబర్ 29న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ఎక్కువగా నీటిపారుదల సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణ, గోదావరి నదీ జలాలపై చర్చ జరగనుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగవు. జనవరి 2న తిరిగి ప్రారంభమవుతాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. కేబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కేసీఆర్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి బాగున్నారా అని పలకరించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ను పలకరించి అభివాదం చేశారు.
రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఉదయం అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. హాజరు రికార్డు పుస్తకంలో సంతకం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
నీటి సమస్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడీగా చర్చ జరగనుంది. కృష్ణా, గోదావరి జలాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరగడంపై కీలక నిర్ణయం ఉంటుంది. జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ తదితర అంశాలకు చట్టబద్ధత ఉండనుంది.
మరోవైపు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. భీంగల్ వంద పడకల ఆసుపత్రి తమ హయాంలోనే మంజూరైనట్టుగా వెల్లడించారు. దాదాపు 85 శాతం పనులు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. రూ.5కోట్లతో మిగిలిన పనులు పూర్తవుతాయన్నారు. నిధులను విడుదల చేసి.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
శాసనమండలి వాయిదా
తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. తిరిగి జనవరి 2న సమావేశం అవనుంది. ఉదయం 10.30కు ప్రారంభమైన సమావేశాల్లో తొలుత సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు సభ నివాళులు అర్పించింది. అనంతరం మంత్రులు పలు కీలక ఆర్డినెన్స్లు, డాక్యుమెంట్లను సభలో ప్రవేశపెట్టారు. సభలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను వాయిదా వేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


