TG Pension Scheme : కొత్త పెన్షన్లకు భారీగా దరఖాస్తులు - నేటితో ముగియనున్న గడువు! రేపట్నుంచే వెరిఫికేషన్

Telangana Cheyutha Pensions Applications : తెలంగాణలో చేయూత కొత్త పెన్షన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ్టితో గడువు ముగియనుండగా… ఇప్పటివరకు దాదాపు 4.8 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

Published on: Aug 31, 2026, 09:16:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Cheyutha Pensions Applications : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చేయూత’ పథకం కింద కొత్త సామాజిక పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు సోమవారమే(ఆగస్ట్ 31) చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త పింఛన్ల దరఖాస్తులు (image source X)
కొత్త పింఛన్ల దరఖాస్తులు (image source X)

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీ నుంచి మొత్తం 5 వేర్వేరు కేటగిరీల్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇవాళ ఒక్కరోజే మిగిలి ఉన్న నేపథ్యంలో….. మరో 50 వేల వరకు అప్లికేషన్లు రావొచ్చని అంచనా.

వీరి నుంచే అత్యధికం…

అందిన దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే…. సమాజంలో ఆర్థిక ఆసరా అవసరమైన వితంతువుల నుంచి అత్యధిక స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన 4,34,854 దరఖాస్తుల్లో ఒక్క వితంతు పింఛన్ల కోసమే 2,64,815 మంది దరఖాస్తు చేసుకున్నారు.

  • వితంతువులు: 2,64,815
  • దివ్యాంగులు: 1,07,171
  • ఒంటరి మహిళలు: 26,057
  • గీత కార్మికులు: 26,343
  • చేనేత కార్మికులు: 10,468

జిల్లాల వారీగా చూస్తే... హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 27,554 దరఖాస్తులు రాగా, ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా 3,620 మంది తమ దరఖాస్తులను అధికారులకు సమర్పించారు.

సెప్టెంబర్ 1 నుంచి గ్రౌండ్ వెరిఫికేషన్…

సోమవారంతో దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుండటంతో, వచ్చిన దరఖాస్తులన్నింటినీ అధికారులు క్రోడీకరిస్తారు. ప్రభుత్వం కేవలం 2.50 లక్షల పింఛన్లకే అనుమతి ఇచ్చినందున…. అందిన మొత్తం దరఖాస్తుల్లో దాదాపు సగం మందికి మాత్రమే కొత్తగా పింఛన్ అందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి అర్హుల ఎంపిక కోసం వడబోత ప్రక్రియను ప్రారంభించనుంది.

గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లి దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితులు, అర్హతలను స్వయంగా తనిఖీ చేస్తారు. పురపాలక, నగర పాలక సంస్థల బిల్ కలెక్టర్లు ఈ పరిశీలన బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా సాగేందుకు స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సహాయాన్ని కూడా తీసుకోనున్నారు.

క్షేత్రస్థాయి అధికారులు సేకరించిన నివేదికలను మొదట మండల, పట్టణ స్థాయి అధికారులకు పంపుతారు. అక్కడ ప్రాథమిక పరిశీలన పూర్తయిన తర్వాత ఆయా జాబితాలు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలోకి వెళ్తాయి. కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతర నివేదికలను తుది అనుమతి కోసం సెర్ప్ ప్రధాన కార్యాలయానికి నివేదిస్తారు. సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన కొత్త పింఛనుదారుల తుది జాబితాను అధికారికంగా ఖరారు చేస్తారు. అర్హులైన పేదలకు ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పింఛన్ డబ్బులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More