ప్లీజ్ తెలుగువారు బయటకు రాకండి.. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలపై సీఎం రేవంత్ రెడ్డి
ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.
ఇరాన్, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే తెలుగు వారిని తిరిగి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల దృష్ట్యా, అన్ని భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఆ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన సలహాలు, హెచ్చరికలను క్రమం తప్పకుండా పాటించాలని కోరారు.

'ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే, అవసరమైతే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తెలుగు ప్రజలను సురక్షితంగా తిరిగి తీసుకువస్తుంది. దయచేసి బయటకు రాకండి.' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ నివాసితుల పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లతో సంప్రదింపులు జరపాలని కూడా తెలిపారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు.
'భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్కు తరలించడానికి అవసరమైన చర్యలు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తీసుకోవాలి.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలం మూసివేశాయి. చాలా విమానాలు రద్దయ్యాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అలకల్లోలం సృష్టి్స్తోంది. చాలా మంది తెలుగువారు కూడా ప్రభావితం అవుతున్నారు.
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు దుబాయ్లో భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ప్రశాంతంగా గడపాల్సిన క్షణం, యుద్ధం లాంటి వాతావరణాన్ని చూసిన తర్వాత ఉద్రిక్తంగా, భయానకమైన పరిస్థితిగా మారిందన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో విష్ణు క్షిపణులను చూపించే వీడియోను పంచుకున్నాడు. క్షిపణులు పైకి ఎగురుతున్నట్లు, గాలిలో అడ్డగించడం తనకు స్పష్టంగా కనిపించిందని వెల్లడించాడు. ఆ దృశ్యాలు, పేలుడు లాంటి పెద్ద శబ్దాలు తీవ్రంగా కలవరపెట్టాయన్నారు.
ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తు చేస్తాయని మంచు విష్ణు అన్నారు. ప్రతి ఒక్కరూ శాంతికి విలువ ఇవ్వాలని కోరారు. యుద్ధం లేని ప్రపంచం కోసం ప్రార్థించారు. భద్రత, సామరస్యాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు.

E-Paper












