Telangana Govt : పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం - ఉగాదికి 'సనత్‌నగర్ టిమ్స్‌' ప్రారంభం

ఉగాదికి సనత్‌నగర్ టిమ్స్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Published on: Feb 13, 2026, 08:44:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఈ హాస్పిటల్‌ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని సర్కార్ నిర్ణయించింది.

సనత్‌నగర్ టిమ్స్‌
సనత్‌నగర్ టిమ్స్‌

ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్‌మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి, హాస్పిటల్‌ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీస్‌లో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ రూమ్‌లు, డయాగ్నస్టిక్స్‌, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు.

వెయ్యి పడకల కెపాసిటీ…

1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. హాస్పిటల్‌ అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు (OTs) శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్ (CT Scan), ఎంఆర్‌ఐ (MRI), డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఇన్‌స్టాలేషన్ జరుగుతోందన్నారు. మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు, ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్ ప్రారంభమయ్యే నాటికి టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు.

సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్‌‌, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి దామోదర సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై ఆరా తీశారు. క్యాథల్యాబ్ ఏర్పాటు పనులు చివరి దశలో ఉన్నాయని…. ఓటీలు ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్‌పై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు టిమ్స్ సనత్‌నగర్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆయా హాస్పిటళ్లలో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి, త్వరితగతిన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి ఆయా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నాన్‌ మెడికల్ సర్వీసెస్‌పై స్పెషల్ ఫోకస్…

హాస్పిటల్ నిర్వహణకు అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. పూర్తిగా కొత్త హాస్పిటల్ అయినందున.. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను సనత్‌నగర్ టిమ్స్‌లో వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

పారిశుధ్యం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే నగరంలోని పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌, నిమ్స్‌, ఎయిమ్స్‌లో అనుసరిస్తున్న పద్ధతులను డీఎంఈ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి, నివేదిక అందజేసింది. ఆయా హాస్పిటల్స్‌లో అవలంభిస్తున్న బెస్ట్ ప్రాక్టీస్‌ విధానాలనే టిమ్స్‌లోనూ అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్‌తో పాటు సానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్‌ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

టెక్నాలజీతో మెరుగైన సేవలు..

రోగులకు ఓపీ (OP) రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్‌ఎంఐఎస్ (e-HMIS) సాఫ్ట్‌వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని మంత్రి దామోదర పేర్కొన్నారు. రోగులకు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చి 15 నాటికి పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి…. ఉగాది నాటికి హాస్పిటల్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More