Kaleshwaram CBI Probe : కాళేశ్వరంపై విచారణ వేగవంతం - సీబీఐకి లేఖ రాయాలని సర్కార్ నిర్ణయం

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ను స్వయంగా కలవాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Published on: Apr 28, 2026, 05:12:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఘోష్ కమిషన్ విచారణ కూడా ముగిసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి కూడా అప్పగించింది. అయితే సీబీఐ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు.

మేడిగడ్డ బ్యారేజీ
మేడిగడ్డ బ్యారేజీ

సీబీఐ విచారణ - సీఎం కీలక సూచనలు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం సమీక్షించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. న్యాయ నిపుణుల సూచనలతో తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ.. సీబీఐకి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే సీబీఐ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

ఈ కేసులో సీబీఐ విచారణకు వీలుగా కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. "అవసరమైతే మంత్రులు నేరుగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలవండి. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలతో మెమోరాండం సమర్పించండి" అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మరో ముగ్గురికి హైకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ప్రభుత్వం తన తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్‌పై చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా విశ్లేషించారు. అయితే, సీబీఐ విచారణ చేపట్టడానికి హైకోర్టు తీర్పు ఎలాంటి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. ఘోష్ కమిషన్ ఏర్పాటును కానీ, దాని నివేదికను కానీ కోర్టు తప్పు పట్టలేదన్నారు. కేవలం దాని ఆధారంగా తక్షణ చర్యలకు మాత్రమే పరిమితులు విధించిందని నిపుణులు వివరించారు.

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, ఇతర బ్యారేజీల్లో పగుళ్లు రావడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గత ఏడాది ఆగస్టులో అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత, దీనిని సీబీఐకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే విచారణ విషయంలోనూ ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More