హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, స్లమ్ ప్రాంతాల్లో అంగన్వాడీ సేవలను సరికొత్తగా అందించే దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు, అలాగే కొత్త అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో… మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఇంటి వద్దకే సరుకులు…

టేక్ హోం రేషన్ విధానంలో అర్హుల నివాసాలకే సరుకులు అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇందులో బాలమృతం, పాలు, స్నాక్స్, కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థాలను పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమం అమలుకు సంవత్సరానికి సుమారు రూ. 4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే మొబైల్ అంగన్వాడీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
37 వాహనాలను సిద్ధం చేసి… వాటి ద్వారా 274 స్లమ్ ఏరియాలను కవర్ చేస్తూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా శిశు సంక్షేమశాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లా వారీగా హైదరాబాద్ లో 7, మేడ్చెల్-మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మొబైల్ కేంద్రాలను సమీప అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. ఫలితంగా అర్హులు ఎక్కడ ఉంటారో వాళ్లు ఉండే చోటనే సరుకులను అందిస్తారు.
అర్హులు నష్టపోవద్దు - మంత్రి సీతక్క
ఈ సందర్బంగా పోషకాహార సేవలు అర్హులందరికీ అందాలని… సాంకేతిక సమస్యలతో ఎవరూ నష్టపోకూడదన్న లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. పోషకాహారానికి ఆటంకం కలగకూడదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైజింగ్– 2047 లక్ష్యాలలో భాగంగా పోషకలోప రహిత తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు.