రాష్ట్రంలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీకి భారీగానే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి,రెండో విడతలో ఎక్కువ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలు కాగా… మూడో విడతలోనే అదే జోరు కనిపించింది. సర్పంచి, వార్డు స్థానాలకు గానూ అత్యధిక సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి.
- ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం…. 3వ విడత కింద 4,158 గ్రామపంచాయతీల్లోని సర్పంచి పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి.
- మూడో విడతలో భాగంగా 36,442 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహించనున్నారు. ఇందుకోసం 89,603 మంది నామినేషన్లు దాఖళయ్యాయి.
- శనివారం నాటికి మూడో విడత నామినేషన్లు ముగిశాయి. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మొత్తం కలిపి 1,16,880 నామినేషన్లు దాఖలయ్యాయి.
- సర్పంచ్ పదవులకు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,962 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో 1,344, సిద్దిపేటలో 1,192, రంగారెడ్డి జిల్లాలో 1,185 నామినేషన్లు వేశారు.
- రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో 11 సర్పంచి పదవులకు ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇందులో అత్యధికంగా ఆరు స్థానాలు నాగర్కర్నూల్ జిల్లాలో ఉన్నాయి.

డిసెంబర్ 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 9న అధికారులు ప్రకటిస్తారు. ఇదే సమయంలో గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన నిర్వహిస్తారు.
మొదటి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత పోలింగ్ ప్రక్రియ డిసెంబర్ 14వ తేదీ నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది.నవంబర్ 19 నుంచి డిసెంబరు 9 వరకు గ్రామాల్లో చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.