Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధితుల కోసం తెలంగాణ హెల్ప్లైన్ నెంబర్లు
Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధితుల కోసం తెలంగాణ హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. దీనిద్వారా నేపాల్లో ఉన్న తెలంగాణవాసుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయవచ్చు.
నేపాల్లో చిక్కుకుపోయిన లేదా ప్రభావితమైన తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఒక హెల్ప్లైన్, సమన్వయ కేంద్రం ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం నేపాల్లో ఉన్న తమ బంధువులు, యాత్రికులు లేదా పర్యాటకులతో సంప్రదించలేకపోతున్న కుటుంబ సభ్యులు ఈ హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు.
సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవడానికి వీలుగా నేపాల్కి వెళ్లిన ఆ వ్యక్తి పేరు, మొబైల్ నంబర్, నేపాల్లో ప్రస్తుత లేదా చివరిగా తెలిసిన ప్రదేశం, ప్రయాణ/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాల వంటి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
సహాయం కోసం ప్రజలు హెల్ప్లైన్ మొబైల్ నంబర్లు: 9871999044, 9949351270, 9618597969 సంప్రదించవచ్చు.
మరోవైపు నేపాల్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. +977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.
భూకంపం కారణంగా భోటేకోశి నదికి వచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్లోని రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను నాశనం చేయడంతో కనీసం 157 మంది మరణించారు. ఈ వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇంకా గల్లంతైన 384 మందిలో 291 మంది విదేశీయులు ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వారు నేపాలీలు ఉన్నారని నేపాల్ పర్యాటక బోర్డు తెలిపింది.
మరోవైపు తెలుగు పర్యాటకుల జాడపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన 156 మంది పర్యాటకులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి వీరంతా అక్కడి ఒక హోటల్లో బస చేశారు. బుధవారం ఉదయం స్థానిక సందర్శనీయ ప్రాంతాలను చూడటానికి 140 మంది పర్యాటకులు బస్సుల్లో బయటకు వెళ్లారు. అయితే స్వల్ప అనారోగ్యం, ప్రయాణ అలసట కారణంగా 16 మంది యాత్రికులు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. 140 మంది ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.
నెట్వర్క్ టవర్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటంతో వారి ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ ఘోర విపత్తు వెనుక మంచు కొండచరియలు విరిగిపడటం, భూకంపం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. టిబెట్ ప్రాంతంలోని లెండే నదిలో మంచు విరిగిపడి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఇది బోటేకోశీకి ఉపనది. ఆ తర్వాత ఆ మంచు ఆకస్మికంగా పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు ఒక్కసారిగా కిందనున్న భోటేకోశీ నదిలోకి దూసుకొచ్చింది. దీంతో చాలా ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


