Bandi Bhagirath POCSO Case : తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా ఈ కేసుపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం….
ఇవాళ తుది తీర్పును వెల్లడించింది.
రూ. లక్ష పూచీకత్తుతో బెయిల్

బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు…. కొన్ని కీలక షరతులను విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రూ. లక్ష రూపాయల సొంత పూచీకత్తుతో పాటు, అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల జామీను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ షరతులను పూర్తి చేసిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేసు దర్యాప్తుకు సంబంధించిన అంశాలపై హైకోర్టు పలు ఆంక్షలు విధించింది. ఈ కేసులో ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని…. కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించవద్దని పేర్కొంది.
కేసు నేపథ్యం
ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా…. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కింది కోర్టులో బెయిల్ రాకపోవడంతో భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించింది.