Disqualification Petition Case : బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్ - ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్ ను ఆదేశించింది.
రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ డిస్మిస్ చేయటాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం…. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.

దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో ప్రస్తావించారు. బీఆర్ఎస్ నుంచి గెలవటమే కాకుండా… కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని తెలిపారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.
ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్కు నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మరోసారి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తెరపైకి వచ్చినట్లు అయింది.
అసలేం జరిగిందంటే..?
బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరానని స్పీకర్ కు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా కోర్టులను కూడా బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈ అనర్హత పిటిషన్లపై విచారించిన స్పీకర్… ఇటీవలనే తీర్పు ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని… పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీలు మారినట్టుగా కూడా ఆధారాలు లేవని చెబుతూ…అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, ప్రకాష్గౌడ్, అరికెపూడి గాంధీ, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు.
అయితే వీరిలో దానం నాగేందర్…. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారమ్ పై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు ఎమ్మెల్యే దానంను టార్గెట్ చేస్తున్నారు. దానంపై అనర్హత పిటిషన్ వేసిన వాళ్లలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాకుండా… బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి కూడా ఉన్నారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ… ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు… దానంకు నోటీసులు ఇచ్చింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

