SIR Voter Verification : వెబ్సైట్లో ‘సర్’ నోటీసుల జాబితా.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
SIR Voter Verification : తెలంగాణలో సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న 92.87 లక్షల మంది ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచింది. మీ పేరు ఆ జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
SIR Voter Verification : రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా చాలా మందికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే అలాంటి ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ వివరాలన్నింటినీ మంగళవారం నుంచి అధికారిక వెబ్సైట్ http://ceotelangana.nic.in లో ప్రచురించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.87 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో డేటా లోపాలు, ఇతర తేడాలు ఉన్న 'అనామలీస్' ఓటర్లు 60.50 లక్షల మంది కాగా, సమాచారం సరిగ్గా సరిపోలని…. 'అన్-మ్యాపింగ్' ఓటర్లు 32.36 లక్షల మంది ఉన్నారు.
ఇప్పటివరకు ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో కేవలం ముసాయిదా ఓటర్ల జాబితాను మాత్రమే అందుబాటులో ఉంచింది. ఆ జాబితాలో ఏ ఏ ఓటర్లకు నోటీసులు వచ్చాయనే స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) నేరుగా ఇంటికి వచ్చి ఫిజికల్ స్లిప్ అందిస్తే తప్ప తమకు నోటీసు వచ్చిందనే విషయం ఓటర్లకు తెలిసేది కాదు. దీనివల్ల ఓటర్లలో తీవ్ర అయోమయం నెలకొంది.
ఈ సమస్యపై స్పందించిన ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నోటీసులు పొందిన ఓటర్ల పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘం అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. స్పందించిన ఎన్నికల అధికారులు, పారదర్శకత కోసం నోటీసులు జారీ అయిన ఓటర్ల జాబితాను వెబ్సైట్లో ప్రచురించారు.
మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
- మొదట ఓటర్లు సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్సైట్ http://ceotelangana.nic.in ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో ఉన్న ‘నో మ్యాపింగ్ అండ్ అనామలీస్’ (No Mapping - Anomalies) ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అక్కడ పోలింగ్ బూత్ల వారీగా నోటీసులు జారీ అయిన ఓటర్ల వివరాలను పరిశీలించుకోవచ్చు.
ఓటర్లు చేయాల్సిందేమిటి?
ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండి, ప్రస్తుతం విడుదల చేసిన నోటీసుల జాబితాలో మీ పేరు లేకపోతే, మీ 'సర్' వివరాలు సమగ్రంగా, సరైన రీతిలో ఉన్నట్లే భావించాలి. అలాంటి వారు అధికారులకు ఎలాంటి గుర్తింపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. రాబోయే తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లను నేరుగా ప్రచురిస్తారు.
ఒకవేళ వెబ్సైట్లోని నోటీసుల జాబితాలో మీ పేరు కనిపిస్తే మాత్రం, అధికారులు సూచించిన నిర్ణీత తేదీల్లో మీ సరైన గుర్తింపు కార్డు వివరాలను, అవసరమైన పత్రాలను బీఎల్వోలకు లేదా సంబంధిత అధికారులకు అందించాల్సి ఉంటుంది.
సర్ గడువు పొడిగింపు:
మరోవైపు తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం తాజాగానే కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును పొడిగించింది. ముందుగా ఈ నెల 16 వరకు ఉన్న గడువును…. అక్టోబర్ 7 వరకు పొడిగించింది.
క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన తర్వాత నవంబర్ 9న తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

