రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త అని తెలిపింది. ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని అభిప్రాయపడింది.
భయం వల్లే ఇదంతా…

ప్రస్తుతం HPCL, IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదని పేర్కొంది. అనవసరం భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రేట్లు విక్రయాలు పెరిగాయని వివరించింది. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు…. కానీ అది కొరత కాదని స్పష్టం చేసింది.
"పెట్రోల్ లేదా డీజిల్ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం PESO(Petroleum and Explosives Safety Organisation) నిబంధనలకు విరుద్ధం. ఇది చాలా ప్రమాదకరం మరియు అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అనవసరంగా నిల్వ చేయవద్దు. తప్పుడు వార్తలను నమ్మకండి.. ప్రచారం చేయకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి"తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరింది.
తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి - సైబరాబాద్ పోలీసులు
“హైదరాబాద్లో ఇప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ కొరత ఏమీ లేదు అని పెట్రోల్ బంకుల యాజమాన్యం చెబుతున్నారు. అందువల్ల వాహనదారులు ఆందోళన పడకుండా… అనవసరంగా బంకుల వద్ద క్యూలో నిలబడకండి. ట్రాఫిక్ సమస్యలు తగ్గించుకోవాలని సూచిస్తున్నాం. అందరికీ ఇది తెలియజేయండి, ఇక్కడ సరఫరా సవ్యంగా ఉంది,తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి” అని సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.