మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీగా నిధులు.. టూరిజం అభివృద్ధి, బోటింగ్!
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సూర్యాపేట జిల్లా మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పర్యాటక కళ రానుంది. కృష్ణా నది తీరాన వెలిసిన ఈ దివ్యక్షేత్రాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మట్టపల్లి క్షేత్రంలో పర్యాటక వసతుల కల్పనతో పాటు, బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు కోసం రూ. 13 కోట్ల పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణి ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. మట్టపల్లి ఆలయాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) రంగంలోకి దిగింది. పర్యాటక శాఖకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం మట్టపల్లి ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అక్కడ భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు, కృష్ణా నదిలో బోటింగ్ పాయింట్ల ఏర్పాటుపై సమగ్ర సర్వే నిర్వహించి, రూ.13 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను తక్షణమే మంజూరు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భక్తులు, పర్యాటకుల కోసం అత్యాధునిక మౌలిక వసతుల కల్పన జరగనుంది. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక బోటింగ్ సౌకర్యాల ఏర్పాటు చేస్తారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన మట్టపల్లి క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు కృష్ణా నదిలో బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుండటంతో, ఆధ్యాత్మిక యాత్రతో పాటు పర్యాటకులకు ఇదొక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మట్టపల్లి ప్రాంతంలో పర్యాటక రంగం మరింత పుంజుకోనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


