సింగరేణి చరిత్రలో సరికొత్త అధ్యాయం - బంగారం, రాగి నిక్షేపాలా అన్వేషణ ప్రారంభం!
Singareni Gold Exploration Karnataka : కర్ణాటకలోని దేవదుర్గలో సింగరేణి సంస్థ బంగారం, రాగి నిక్షేపాలా అన్వేషణ పనులను అధికారికంగా ప్రారంభించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Singareni Gold Exploration Karnataka : బొగ్గు గనుల తవ్వకాల్లో శతాబ్దానికి పైగా విశేష అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన వ్యాపార విస్తరణలో భాగంగా మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా లింగదహళ్లి గ్రామానికి సమీపంలో ఉన్న దేవదుర్గ బ్లాక్లో ప్రతిష్టాత్మకమైన బంగారం, రాగి (కాపర్) ఖనిజ నిక్షేపాలా అన్వేషణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రారంభించింది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఈ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన అధికారులతో కలిసి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…. గనుల రంగంలో సింగరేణికి దాదాపు 136 సంవత్సరాల సుదీర్ఘ అనుభవముందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన జాతీయ స్థాయి వేలంలో అత్యంత పోటీ నడుమ సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకోవడం అభినందనీయమని చెప్పారు. త్వరలోనే ఇక్కడ అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
దేవదుర్గ బ్లాక్లో చేపడుతున్న ఈ పరిశోధనలు సఫలమై, ఆశించిన స్థాయిలో బంగారం, రాగి నిక్షేపాలు లభ్యమైతే రాయచూర్ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున గనుల తవ్వకాలు ప్రారంభమైతే స్థానిక నిరుద్యోగ యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ సాధించే విజయం తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని, దేశ ఖనిజ సంపదను పెంచి జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని వివరించారు.
దేవదుర్గలో సైట్ ఆఫీస్, హెలిప్యాడ్ ఏర్పాటు
పనుల పర్యవేక్షణను వేగవంతం చేసేందుకు సింగరేణి అధికారులు స్థానికంగానే ఉండేలా దేవదుర్గలో త్వరలోనే ఒక ప్రత్యేక 'సైట్ ఆఫీస్'ను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో పాటు అధికారుల అత్యవసర రాకపోకల సౌకర్యార్థం ఒక హెలిప్యాడ్ను కూడా నిర్మిస్తామన్నారు. దీనికి అవసరమైన భూమిని స్థానిక రెవెన్యూ అధికారులు కేటాయించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా విజయవంతంగా పూర్తి చేసేందుకు స్థానిక ప్రజలు, యంత్రాంగం సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు.
ఖనిజ నమూనాల ప్రదర్శన పరిశీలన
తన పర్యటనలో భాగంగా లింగదహళ్లి వ్యూపాయింట్ నుంచి అన్వేషణ కోసం గురించిన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అనంతరం సింగరేణి అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలను (సాంపిల్స్) ఆయన ఆసక్తిగా తిలకించారు. బంగారం, రాగి నిక్షేపాల వెలికితీత సాంకేతికత, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఒకప్పుడు ‘బ్లాక్ గోల్డ్’గా పిలిచే బొగ్గుతో గుర్తింపు పొందిన సింగరేణి... ఇప్పుడు నిజమైన ‘గోల్డ్’నే వెలికితీయబోతోంది. ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైతే.. సింగరేణి చరిత్రలో మరో ప్రస్థానం షురూ అయినట్లు అవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

