బాధితులను ఆసుపత్రికి చేరిస్తే చాలు.. రవాణా శాఖ నుంచి మీ అకౌంట్‌లోకి రూ. 25 వేలు!

రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన రహ వీర్ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తోంది.

Published on: Feb 09, 2026 1:26 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రవాణా శాఖ రహ-వీర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కింద రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడే పౌరులకు రూ. 25,000 నగదు ప్రోత్సాహకంతో బహుమతిగా ఇస్తుంది. అంతేకాదు అధికారికంగా సత్కరిస్తారు. సర్టిఫికేట్ కూడా అందిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ మేరకు రవాణా శాఖ ఈ స్కీమ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎంపిక విధానాలను రూపొందించాలని, ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఒక సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం.

పథకం కింద ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడానికి, వారిని ఆసుపత్రులకు తరలించడానికి పౌరులు ముందుకు వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడే వారిని రహ-వీర్‌లుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ప్రాణాలను కాపాడడంలో పౌరులు సకాలంలో జోక్యం చేసుకోవడం చాలా కీలకమని అధికారులు తెలిపారు చట్టపరమైన లేదా విధానపరమైన వేధింపులకు భయపడకుండా ఇటువంటి చర్యలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం.

మార్గదర్శకాల ప్రకారం, తక్షణ సహాయం అందించే, బాధితుడిని ఆసుపత్రికి తరలించే వ్యక్తి వివరాలను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO), ఆసుపత్రి అధికారులు నమోదు చేస్తారు.

ఆ తరువాత పోలీసులు ఈ కేసును జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి సభ్యులుగా, జిల్లా రవాణా అధికారి కన్వీనర్‌గా ఉన్న జిల్లా స్థాయి కమిటీకి సిఫార్సు చేస్తారు. పరిశీలన, ఆమోదం తర్వాత ఎంపికైన రహ వీర్ల వివరాలను రివార్డ్, సర్టిఫికేట్ కోసం రవాణా కమిషనర్‌కు పంపుతుంది.

ప్రమాద దృశ్యాలను చూసి కేవలం ప్రేక్షకులుగా ఉండకూడదని, బాధితులకు సహాయం చేయడానికి నిర్భయంగా ముందుకు రావాలని రవాణా శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బాధ్యతగల పౌరులుగా ఉండాలని కోరుతోంది. ఒక చిన్న సాయం కూడా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. సహాయం అందించే వారికి పూర్తి రక్షణ, గౌరవం కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు.

ప్రమాదం జరిగినప్పటి నుంచి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తే.. ప్రాణాలు కాపాడవచ్చు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేసుల భయం లేకుండా ఇకపై మీరు సాయం చేయవచ్చు. రూ.25000 రివార్డుతోపాటుగా ప్రశంసా పత్రాన్ని పొందుతారు.