వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడం - ఈ తేదీల్లో తెలంగాణకు వర్ష సూచన..! అంచనాలు ఇలా
ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలి తీవ్రత క్రమంగా తగ్గిపోతుంది. ఈనెలలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చలి తీవ్రత తగ్గుతూ… ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నెల దాటిన తర్వాత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉక్కపోత కూడా ప్రారంభమైంది. అయితే ఈ ఏడాదిలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
అల్పపీడం ఎఫెక్ట్…
మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సోమవారం అల్పపీడం ఏర్పడింది. ఇది ఈనెల 18వ తేదీ నాటికి నైరుతి బంగాళాతం వైపు కదులుతూ హిందూ మహాసముద్ర మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజాగా ఏర్పడిన అల్పడీనంతో…. ఈనెల 18వ తేదీన రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పడొచ్చని అంచనా. ఇక ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉత్తర తెలంగాణతో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం….ఫిబ్రవరి 22వ తేదీన ఆదిలాబాద్ నుంచి ములుగు వరకు కొన్నిచోట్ల వర్షాలు పడొచ్చు. ఫిబ్రవరి 23 - 24 తేదీల మధ్య హైదరాబాద్, వరంగల్, సిద్ధిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి ఈ వర్షాలపై మరింత క్లారిటీ రావొచ్చు అని అంచనా.
ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అయితే ఎలాంటి వర్ష సూచన లేదని అంచనా వేసింది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

