TG DOST 2026 Special Phase Counseling : రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ప్రత్యేక విడతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు నేటితో (జూలై 26, 2026) ముగియనుంది. అర్హత గల విద్యార్థులు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యామండలి సూచించింది.
దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు
- అర్హులైన విద్యార్థులు… రూ. 400/- ఫీజు చెల్లించి జూలై 26, 2026 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.
- విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలను ఎంచుకోవడానికి జూలై 27, 2026 వరకు అవకాశం కల్పించారు.
- పీహెచ్ (PH), సీఏపీ (CAP), ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్, అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నవారికి జూలై 27, 2026 న యూనివర్సిటీ హెల్ప్లైన్ కేంద్రాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది.
- జూలై 30, 2026 న సీట్లు కేటాయిస్తారు.
- సీటు పొందిన విద్యార్థులు జూలై 30, 2026 నుండి ఆగస్టు 01, 2026 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
- ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ టీసీ (TC) మరియు ఇతర ధృవీకరణ పత్రాలను జూలై 31, 2026 నుండి ఆగస్టు 01, 2026 లోపు సంబంధిత కళాశాలలో సమర్పించాలి. సరైన సమయంలో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపు రద్దవుతుంది.

ఇంతవరకు దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియలో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు, అలాగే గత మూడు విడతలలో దరఖాస్తు చేయని వారు ఈ ప్రత్యేక విడతలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి పూర్తిగా అర్హులవుతారు. గతంలో దోస్త్ ఐడీ పొంది, ఇప్పటివరకు జరిగిన ఏ విడతలోనూ సీటు సాధించలేకపోయిన అభ్యర్థులు తమ పాత ఐడీ మరియు పిన్ (PIN) ఉపయోగించి నేరుగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అలాగే…. గత విడతలలో సీటు వచ్చి నచ్చని కళాశాలలో చేరిన వారు ఇప్పుడు కొత్తగా వేరే కాలేజీకి మారాలనుకుంటే ఈ ప్రత్యేక విడత ద్వారా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు తమకు సీటు లభించే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.