తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల మీద హైకోర్టు తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల మీద తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల వ్యవహారంపై ఆరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. చట్ట ప్రకారం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

ఎస్సీ, ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో సైతం ఆయా కులాలకు సర్పంచ్, వార్డు మెంబర్లుగా రిజర్వేషన్లు కేటాయించారని పిటిషన్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు తప్పుగా కేటాయించడం కారణంగా తప్పులు జరిగాయని వెల్లడించారు. అయితే రిజర్వేషన్లు కేటాయించిన ప్రదేశాల్లో సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే.. ఎన్నికలు నిర్వహించమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ వాదనలను రికార్డు చేసుకున్న ధర్మాసనం.. విచారణను క్లోజ్ చేసింది.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మెుదలైంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉండనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది. ఒక దశకు మరో దశకు మధ్య రెండు రోజుల తేడా ఉంటుంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 14, 17వ తేదీల్లో రెండు, మూడో దశ పోలింగ్ ఉంటుంది
మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయతీలు, లక్షా 13,534 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు ఉంటాయి. రెండో విడతలో భాగంగా 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు.














