TG ICET 2026 Final Phase Counselling : రాష్ట్రంలోని ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్ (TG ICET) 2026 చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి (ఆగస్టు 17) నుంచి ప్రారంభమైంది. మొదటి విడత కౌన్సెలింగ్లో పాల్గొనని విద్యార్థులకు, మంచి కళాశాలల్లో సీటు ఆశిస్తున్న అభ్యర్థులకు ప్రవేశాలు పొందేందుకు ఇదే చివరి అవకాశం.

షెడ్యూల్ ప్రకారం…. నేటి నుంచి ఆన్లైన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసుకోవడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధృవపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మొదటి విడతలో పాల్గొనని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హెల్ప్ లైన్ సెంటర్లలో ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
టీజీ ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ తేదీలు :
- ఆన్లైన్ వివరాల నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 17-08-2026
- ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్: 18-08-2026
- వెబ్ ఆప్షన్ల నమోదు (కోర్సు, కళాశాల ఎంపిక): 18-08-2026 నుండి 19-08-2026 వరకు
- వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్: 19-08-2026
- తాత్కాలిక సీట్ల కేటాయింపు (ప్రొవిజనల్ అల్లాట్మెంట్): 22-08-2026 లేదా అంతకంటే ముందు
- ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్: 22-08-2026 నుండి 24-08-2026 వరకు
- కేటాయించిన కళాశాలలో నేరుగా రిపోర్టింగ్ చేయడం: 22-08-2026 నుండి 25-08-2026 వరకు
మొదటి విడతలో సీటు వచ్చినా చేరని వారు, ప్రాధాన్యత కలిగిన కళాశాలలో సీటు పొందేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి అధికారులు సూచించారు. ఇచ్చిన గడువులోగా నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 22 నాటికి సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన విద్యార్థులు నిర్దేశిత తేదీల్లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి, తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.