...
...
Next Story

పీసీబీ రూల్స్ పాటించలేదని 305 పరిశ్రమలు మూసివేత.. కొత్తగా హెల్ప్‌లైన్, యాప్‌

తెలంగాణలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Published on: Nov 26, 2025, 18:19:12 IST
Advertisement

కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు 305 పరిశ్రమలను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు(TGPCB) ఆదేశించింది. పర్యావరణ చట్టాల అమలును బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతమైన కాలుష్య నియంత్రణను నిర్ధారించడం ఈ చర్య లక్ష్యంగా తెలుస్తోంది

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కాలుష్య తీవ్రత ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్‌గా వర్గీకరిస్తుందని TGPCB అధికారులు తెలిపారు. ఈ కేటగిరీల కింద తెలంగాణలో మొత్తం 12,264 పరిశ్రమలు ఉన్నాయి. ఈ వర్గీకరణకు అనుగుణంగా TGPCB కొత్త, ఇప్పటికే ఉన్న పారిశ్రామిక యూనిట్లను నిశితంగా పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు.

జనవరి 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య బోర్డు 2,620 కొత్త కంపెనీల స్థాపనకు అనుమతులు మంజూరు చేసింది. వాయు, నీటి కాలుష్య నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ధృవీకరించిన తర్వాత 3,521 యూనిట్లకు ఆపరేషన్ కోసం సమ్మతి (CFO) జారీ చేసింది.

ఇదే కాలంలో అధికారులు 2,069 పరిశ్రమలను తనిఖీ చేసి, కఠినమైన కాలుష్య నిర్వహణను నిర్ధారించడానికి ఉల్లంఘనలకు 1,234 యూనిట్లకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలను పాటించలేదని నిర్ధారించిన తర్వాత ఔషధ యూనిట్లు, ప్లాస్టిక్ పరిశ్రమలు, రసాయన కర్మాగారాలు సహా 305 పరిశ్రమలకు మూసివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి.

టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్

ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం TGPCB టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ 10741, 'జనవాణి - కాలుష్య నివారిణి' అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. పారిశ్రామిక జోన్‌లలో రాత్రి పెట్రోలింగ్ కూడా చేస్తారు. బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమలలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్(ZLD) వ్యవస్థలను కఠినంగా అమలు చేయడం, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం వంటి ప్రభావవంతమైన చర్యలు కాలుష్య తగ్గింపుకు దోహదం చేస్తున్నాయి.

అయితే ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా అధికారికంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. హైదరాబాద్ సిటీ లోపల ఉన్న కాలుష్యకారక, ఔట్‌డేటెడ్ టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తారు. ఈ హిల్ట్ పాలసీ అమలులో భాగంగానే తాజాగా పరిశ్రమలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోందని కొందరు భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe