టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ కనెక్ట్.. 373 కాలనీలకు బస్సులు.. 7.6 లక్షల మందికి బెనిఫిట్
పౌరులకు రవాణా సేవలను మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) 'హైదరాబాద్ కనెక్ట్' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద గ్రేటర్ హైదరాబాద్ అంతటా 373కి పైగా కొత్త కాలనీలలో బస్సు సేవలను ప్రవేశపెట్టారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 'హైదరాబాద్ కనెక్ట్' ప్రణాళిక కింద 373 కొత్త కాలనీలకు తన సేవలను విస్తరించింది. దీని వలన 7.6 లక్షల మంది నగరవాసులకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ సేవలు డిసెంబర్ నుంచే అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్ ప్రాంతాలలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.
కొత్తగా హైదరాబాద్ కనెక్ట్లో భాగంగా 373 కాలనీలలో బస్సులు తిరుగుతాయి. ఇందులో 243 హైదరాబాద్ ప్రాంతం నుండి, 130 సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఎంపిక చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్ డిపోల వారీగా సర్వీసులు ఏ ప్రాంతం నుంచి ఎన్ని కాలనీలకు ఉంటాయో చూద్దాం..
హైదరాబాద్
దిల్ సుఖ్ నగర్: 55 కాలనీలు
రాజేంద్రనగర్: 51 కాలనీలు
మిధాని: 42 కాలనీలు
బండ్లగూడ: 34 కాలనీలు
మెహదీపట్నం: 17 కాలనీలు
ఇబ్రహీంపట్నం: 14 కాలనీలు
హయత్నగర్-1: 12 కాలనీలు
హయత్నగర్-2: 10 కాలనీలు
ఫలక్నుమా: 7 కాలనీలు
మహేశ్వరం: 1 కాలనీ
సికింద్రాబాద్
జీడిమెట్ల: 36 కాలనీలు
చెంగిచెర్ల: 25 కాలనీలు
కూకట్పల్లి: 21 కాలనీలు
మేడ్చల్: 10 కాలనీలు
ఉప్పల్: 10 కాలనీలు
హెచ్సీయూ: 8 కాలనీలు
మియాపూర్-2: 7 కాలనీలు
కంటోన్మెంట్: 6 కాలనీలు
రాణిగంజ్: 4 కాలనీలు
కుషాయిగూడ: 3 కాలనీలు
ఈ సందర్భంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 'గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పడిన కాలనీల నివాసితులు ఎటువంటి రవాణా సమస్యలను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో మేం 'హైదరాబాద్ కనెక్ట్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం.' అని చెప్పారు.
హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమం మూడు దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ సేవలు అత్యంత రద్దీగా ఉండే కాలనీలలో అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని నివారించడం అనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రజల అభ్యర్థనలు, అవసరాల ఆధారంగా కొత్త కాలనీలను ఎంచుకోవడానికి క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించామని మంత్రి పొన్నం అన్నారు. ఈ కాలనీల నుండి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఉద్యోగ కేంద్రాలకు కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రయాణ సమయం, ఖర్చులు ఆదా అవుతాయని, అలాగే ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. జనాలు ఈ బస్సుల గురించి TGSRTC Gamyam యాప్లో తనిఖీ చేయవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


