హైదరాబాద్ రోడ్లపైకి మరో 65 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చిన టీజీఎస్ఆర్టీసీ!
హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. మరో 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చింది. వీటిని తాజాగా ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) సహకారంతో ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బుధవారం టీజీఎస్ఆర్టీసీ 500 లో-ఫ్లోర్ సిటీ బస్ ప్రాజెక్ట్ కింద రాణిగంజ్ డిపో నుండి 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించింది. ఈ బస్సుల ఎంట్రీతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత ప్రజలకు చేరువకానుంది. రాణిగంజ్ డిపోకు 100 బస్సుల కేటాయింపులో భాగం ప్రస్తుతం 65 బస్సులు ప్రవేశపెట్టారు.

టీజీఎస్ఆర్టీసీ 500 బస్సుల ప్లాన్లో 450 నాన్-ఏసీ, 50 ఏసీ లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ సిటీ బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు, 325 బస్సులు డెలివరీ అయ్యాయి. మిగిలిన 175 బస్సులు జనవరి 2026 నాటికి ఇండక్షన్ కోసం షెడ్యూల్ చేస్తారు. దీనితోపాటుగా ఆర్టీసీ విస్తృత మార్పుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సు నెట్వర్క్ను క్రమంగా విస్తరిస్తోంది.
ఈ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 'ఈ కొత్త బస్సులు దాదాపు 373 కాలనీలను కలుపుతాయి. గత రెండు సంవత్సరాలలో బస్సుల సంఖ్య 40 శాతం పెరిగింది. సేవలను బలోపేతం చేయడానికి కొత్త సిబ్బంది నియామకాన్ని కూడా ప్రారంభించాం. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడం, పరిశుభ్రతను నిర్ధారించడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కొత్త డిపోలను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈరోజు 65 కొత్త బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది సిటీ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.' అని పొన్నం అన్నారు.
'ఈరోజు బస్సుల ప్రారంభంతో ఇది భారతదేశంలో మా 69వ డిపో, తెలంగాణలో ఐదో డిపో అవుతుంది. దేశవ్యాప్తంగా మేం 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 3,100 కి పైగా బస్సులను విజయవంతంగా నడుపుతున్నాం. జనవరి 2026 నాటికి మిగిలిన బస్సులను డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. మా బస్సులన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రయాణీకులకు సజావుగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.' అని ఎవే ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాదా అన్నారు.
36 మంది సీటింగ్ సామర్థ్యంతో, ఈ బస్సులు న్యూమాటిక్ తలుపులు, ఆటోమేటెడ్ అనౌన్స్మెంట్లు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్లు, వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక యాక్సెసిబిలిటీ ఫీచర్లను అందిస్తున్నాయి.
ఈ బస్సులు సికింద్రాబాద్, కొండాపూర్, ఇస్నాపూర్, బోరబండ, రామాయంపేట, గచ్చిబౌలి, మియాపూర్లను కనెక్ట్ చేసే ప్రధాన మార్గాల్లో నడుస్తాయి. రోజువారీ ప్రయాణ సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఈ కొత్త బస్సులు శబ్దం, ఉద్గారాలను తగ్గిస్తుందని, ఖర్చులను తగ్గిస్తుంది. హైదరాబాద్లోని ప్రయాణికులకు నిశ్శబ్ద, సున్నితమైన, పర్యావరణ అనుకూల ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని చెబుతున్నారు.
పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన పట్టణ రవాణా వ్యవస్థను నిర్మించడానికి టీజీఎస్ఆర్టీసీ, ఎవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పని చేస్తు్న్నాయి. హైదరాబాద్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పెంచుతూనే ఉంది. పర్యావరణానికి ఈ బస్సులు అనకూలంగా ఉంటాయి.














