జూన్ నుంచి మహాలక్ష్మీ స్మార్ట్‌కార్డులు.. ఇక బస్సులో ఆధార్ చూపాల్సిన పని లేదు!

ఇకపై బస్సులో ఆధార్ చూపించాల్సిన అవసరం లేదు. అతి త్వరలో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

Published on: Feb 19, 2026 10:08 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే స్మార్ట్‌కార్డుల పంపిణీ. ఈ కార్డులు ఎప్పటి నుంచి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీని ఆదేశించింది. తెలంగాణ బడ్జెట్‌ సన్నాహక సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.

జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు
జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు

ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపుపై కూడా చర్చ జరిగింది. స్మార్ట్‌కార్డులను వీలైనంత త్వరగా మహిళలకు అందజేయాలని నిర్ణయించారు. మూడు రకాల స్మార్ట్‌కార్డులను భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌లకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చూపించారు.

అయితే మెుదట రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే.. పరిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. చిప్‌తో ఈ స్మార్ట్‌కార్డులను తయారీ చేస్తారు. సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు.

ఇతర రాష్ట్రాల మహిళలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించడం వంటి దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఉచిత ప్రయాణ ప్రయోజనాలను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యం. ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధం చేసిన మూడు డిజైన్‌లతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు, సజావుగా టిక్కెట్ల జారీ, ధృవీకరణను సులభతరం చేస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ఏదో ఒక స్మార్ట్‌కార్డును ఫైనల్ చేసే అవకాశం ఉంది.

మార్చి 1, 2026 నుండి టీజీఎస్ఆర్టీసీ ఏసీ, లగ్జరీ బస్సులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రీమియం ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడానికి ఎక్స్‌ప్రెస్ బస్సు రేట్లతో ఛార్జీలను పోలుస్తారు. 'సమర్థవంతమైన సేవల కోసం త్వరలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నాం. ఇంకా, ఔటర్ రింగ్ రోడ్‌లో ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్య నియంత్రణకు సహాయపడతాయి. PM e-డ్రైవ్ పథకం కింద 2,000 కొత్త బస్సులు వస్తున్నాయి.' అని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి చెప్పారు.

డిసెంబర్ 9, 2023న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సులలో జీరో ఫేర్ రైడ్‌లను అందించడం ద్వారా తెలంగాణలో మహిళల ప్రయాణం భారీగా పెరిగింది. లబ్ధిదారులు జీరో టికెట్ కోసం ఆధార్ కార్డును చూపించాలి. ప్రారంభమైనప్పటి నుండి ఈ పథకాన్ని మహిళలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాడు. మొదటి నాలుగు నెలల్లోనే మహిళలకు రూ.1,177 కోట్లు ఆదా చేసింది. రోజువారీ ప్రయాణాలు కూడా పరిగాయి.