...
...
Next Story

తెలంగాణలో తొలిసారిగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు.. జూన్ 1 వరకు పవిత్ర స్నానాలు! పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో తొలిసారిగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. భక్తుల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.

Published on: May 21, 2026, 12:39:39 IST
Advertisement

ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి పవిత్ర ఘాట్ వద్ద వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ పుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పాల్గొని నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సరస్వతీ నది అంత్య పుష్కరాలు
సరస్వతీ నది అంత్య పుష్కరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తొలిసారిగా ఈ అంత్య పుష్కరాలను ఇంత భారీ ఎత్తున అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వం ఏర్పాట్లు

ఘాట్ల పరిసరాల్లో ఎండ దెబ్బ తగలకుండా భారీ టెంట్లు, నిరంతరం చల్లటి గాలినిచ్చే కూలర్లను ఏర్పాటు చేశారు. సరస్వతీ ఘాట్‌తో పాటు ప్రధాన ఘాట్ల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా 300కు పైగా తాత్కాలిక గదులను నిర్మించారు.

నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ, భక్తులు లోతులోకి వెళ్లకుండా రక్షణ తాళ్లను కట్టారు. నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను, గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. జూన్ 1వ తేదీ వరకు కొనసాగే ఈ పుష్కరాల్లో ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నదీమతల్లికి అత్యంత కంటికింపైన ‘సరస్వతీ నది హారతి’ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రత్యేకత ఏంటి?

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరాలు జరుగుతాయి. ప్రవేశించే మొదటి 12 రోజులను 'ఆది పుష్కరాలు' అని, ఆ రాశి నుంచి నిష్క్రమించే చివరి 12 రోజులను 'అంత్య పుష్కరాలు' అని పిలుస్తారు.

కాళేశ్వరం దక్షిణ గంగగా పిలిచే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహిణిగా (భూగర్భంలో) ప్రవహించే సరస్వతీ నది కలయికతో ఏర్పడిన మహా పవిత్ర క్షేత్రం (త్రివేణీ సంగమం). భారతదేశంలో సరస్వతీ నది అంతర్వాహిణిగా ఉన్న క్షేత్రాలు రెండే రెండు: ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) – ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. తెలంగాణలోని కాళేశ్వరం-ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి.

5 రాష్ట్రాల నుండి భక్తుల రాక

ఈ అంత్య పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుండి దాదాపు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి ప్రత్యేక రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని, త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks