Heavy rains : ఎండల నుంచి రిలీఫ్​- తెలంగాణ, ఆంధ్ర నుంచి అసోం వరకు.. ఈ వారంలో భారీ వర్షాలు

Today weather report : రానున్న వారం రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి. దిల్లీలో బలమైన గాలులు వీచనుండగా, ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, హిమాలయాల్లో మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.

Published on: Mar 16, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సహా దేశవ్యాప్తంగా మార్చి మొదటి వారంలో భానుడి భగభగలకు అల్లాడిపోయిన అనేక రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లటి కబురు ఇచ్చింది! రానున్న వారం రోజుల్లో దేశంలోని అనేక చోట్ల తేలికపాటి, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తద్వారా ఎండలకు బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఉపశమనం కలుగుతుందని వివరించింది.

తెలంగాణ టు అరుణాచల్​ ప్రదేశ్​.. దేశవ్యాప్తంగా వర్షాలు..
తెలంగాణ టు అరుణాచల్​ ప్రదేశ్​.. దేశవ్యాప్తంగా వర్షాలు..

ఈ నేపథ్యంలో ఐఎండీ ప్రకారం దక్షిణ, ఉత్తర, ఈశాన్య భారతంలో తాజా పరిస్థితులను, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీలో గాలుల హోరు:

దేశ రాజధాని దిల్లీలో మార్చి నెల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా మార్చి మొదటి వారంలోనే పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మే వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా? అని ప్రజలు భయపడిపోయారు. ఈ తరుణంలో దిల్లీలో ఆదివారం ఉదయం వర్షాలు పడ్డాయి. ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అక్కడి నుంచి రోజంతా వాతావరణం సాధారణంగానే ఉంది.

ఇక సోమవారం దిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, పగటిపూట గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయి, గాలుల వేగం 15-25 కిలోమీటర్లుగా ఉండవచ్చు. అయితే, బుధవారం నాడు వాతావరణం మరింత మారనుంది. ఆ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

హిమాలయాల్లో మంచు.. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షం!

పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో ఆదివారం అప్పుడే తాజా హిమపాతం ప్రారంభమైంది. కశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో మంచు కురుస్తుండగా, మైదాన ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మార్చి 15 నుంచి 21 మధ్య పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో విస్తారంగా తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఇతర రాష్ట్రాలపై ప్రభావం:

ఉత్తరప్రదేశ్: మార్చి 16న తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అంతకుముందు ఆదివారం కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి.

ఉత్తరాఖండ్: మార్చి 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా బలమైన గాలులతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.

రాజస్థాన్, పంజాబ్, హరియాణా: ఈ రాష్ట్రాల్లో ఆదివారం కురిసిన చిరుజల్లుల వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు తగ్గుముఖం పట్టాయి.

లక్నో వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ మార్పులకు కారణమైన ‘పశ్చిమ అల్లకల్లోలం’ మార్చి 16 వరకు బలంగా ఉంటుంది. 17, 18 తేదీల్లో వాతావరణం పొడిగా మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అయితే, మార్చి 19, 20 తేదీల్లో ఈ ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుని జోధ్‌పూర్, బికనీర్, అజ్మీర్, జైపూర్, భరత్‌పూర్ డివిజన్లలో ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక – యెల్లో అలర్ట్!

ఈశాన్య భారత రాష్ట్రాల్లో మార్చి 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

మార్చి 15న ఒడిశాలో విధ్వంసం సృష్టించిన సుడిగాలికి కారణమైన అదే వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలకు కారణమవుతున్నాయి.

కాగా అసోం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు 'యెల్లో అలర్ట్' జారీ చేశారు. "నివాసితులు అప్రమత్తంగా ఉండాలి, అధికారిక వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అనుసరించాలి," అని ఐఎండీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్​' ద్వారా సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..

భారత వాతావరణ శాఖ సోమవారం (మార్చి 16, 2026) తెలంగాణ 14 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక జారీ చేసింది. ఐఎండీ బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు పడే అవకాశం ఉంది.

తెలంగాణ వెదర్​ అప్డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక ఆంధ్రప్రదేశ్​లో మార్చి 17 నుంచి, ముఖ్యంగా రాయలసీమలో మార్చి 19న భారీ వర్షాలు కురుస్తాయి. ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు 40.17 డిగ్రీలకు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ధృవీకరించింది. ఇది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలను కురిపించనుంది.

ఆంధ్రప్రదేశ్​లో వర్షాల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More