ఉప్పల్ రింగ్ రోడ్డు పాక్షికంగా మూసివేత - బస్ స్టాప్ల మార్పు, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..!
Uppal Ring Road Traffic Diversions : ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఆదివారం (మే 17) నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Uppal Ring Road Traffic Diversions : హైదరాబాద్ నగరం నుంచి వరంగల్ జాతీయ రహదారి వైపు ప్రయాణించే వాహనదారులకు…. రోజువారీ ప్రయాణికులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటంతో.. ఉప్పల్ రింగ్ రోడ్ పరిసరాల్లో తాత్కాలికంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అలాగే ఆర్టీసీ బస్ స్టాప్లను కూడా వేరే ప్రాంతానికి మారుస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 17 ఆదివారం ఉదయం నుంచే ఈ కొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

వరంగల్ వెళ్లే ఆర్టీసీ బస్ స్టాప్ మార్పు
వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు సౌకర్యార్థం ఉప్పల్ జీహెచ్ఎంసీ ఆఫీస్ సమీపంలో ఉన్న పాత బస్ స్టాప్ను తాత్కాలికంగా రీలోకేట్ చేశారు. ఈ రూట్లలో వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇకపై పాత స్టాప్ వద్ద ఆగవు. ప్రయాణికులు అందరూ ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన నూతన తాత్కాలిక బస్ స్టాప్ నుండి మాత్రమే బస్సులు ఎక్కాలని ఆర్టీసీ, పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
రహదారి మూసివేత - ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే:
ఆదివారం ఉదయం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని నిర్మాణ పనుల నిమిత్తం తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పోలీసులు క్రింది విధంగా రూట్ మ్యాప్ ప్రకటించారు.
- వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు : వరంగల్ వైపు నుండి వచ్చే సాధారణ వాహనాలు మేఫిల్ (Mayfeel) హోటల్ దాటిన తర్వాత.. ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ వైపు వెళ్లాలి. అక్కడ సర్వీస్ రోడ్డు గుండా వెళ్లి, ఫ్లైఓవర్ కింద యూ-టర్న్ (U-Turn) తీసుకుని హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
- హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు : నగరంలో నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే చిన్న వాహనాలు సర్వే ఆఫ్ ఇండియా (Survey of India) జంక్షన్ వద్ద పిస్తా హౌస్ పక్కన ఉన్న రోడ్డు మార్గంలోకి మళ్లాలి. అక్కడ నుంచి బీరప్ప గడ్డ మీదుగా ప్రయాణించి తిరిగి జాతీయ రహదారి (NH-163) లోకి ప్రవేశించి వరంగల్ వైపు వెళ్లవచ్చు.
ఉప్పల్ భగాయత్ అంతర్గత రహదారులు చాలా ఇరుకుగా ఉండటాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాల కదలికలపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. లారీలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, భారీ ట్రక్కులు ఈ అంతర్గత రోడ్లలోకి రాకుండా నిషేధం విధించారు.
- వరంగల్ టు హైదరాబాద్ భారీ వాహనాలు : వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఉపయోగించి ఘట్కేసర్ మీదుగా హయాత్నగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- హైదరాబాద్ టు వరంగల్ భారీ వాహనాలు : నగరం నుంచి వరంగల్ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఎల్బీనగర్ - హయాత్నగర్ మార్గంలో ఓఆర్ఆర్ (ORR) ఎక్కి ఘట్కేసర్ మీదుగా వరంగల్ హైవేను చేరుకోవాలని సూచించారు.
ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సజావుగా సాగడానికి, ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ప్రయాణికులందరూ ముందస్తుగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

