...
...
Next Story

Rajahmundry Airport : రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ఏడాదిలో 31 బర్డ్ హిట్ ఘటనలు.. అధికారుల కీలక నిర్ణయాలు

Rajahmundry Airport : రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బర్డ్ హిట్ కలకలం రేపుతోంది. ఏడాదిలో 31 ఘటనలు జరిగాయి. దీంతో అధికారుల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published on: Jul 28, 2026, 14:19:40 IST
Advertisement

రాజమండ్రి విమానాశ్రయంలో విమానాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2025-26 సంవత్సరంలో విమాన సర్వీసుల నిర్వహణ సమయంలో కనీసం 31 బర్డ్ హిట్(విమానాలను పక్షులు ఢీకొట్టడం) ఘటనలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడం ఊరటనిచ్చే విషయం.

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బర్డ్ హిట్ ఘటనలు
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో బర్డ్ హిట్ ఘటనలు

సురక్షిత విమాన సర్వీసుల నిర్వహణపై ఇటీవల నిర్వహించిన 'రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ' సమీక్షా సమావేశంలో ఈ వివరాలను అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె. ప్రీత, టెర్మినల్ మేనేజర్ కృష్ణ చైతన్య పాల్గొని పలు కీలక అంశాలను మాట్లాడారు.

విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న మధురపూడి, గుమ్మలూరు, బూరుగుపూడి వంటి ప్రాంతాల్లో అక్రమంగా ఘన వ్యర్థాలను వేయడం, పౌల్ట్రీ వ్యర్థాలను విచ్చలవిడిగా పారవేయడమే పక్షులు పెద్ద సంఖ్యలో చేరడానికి ప్రధాన కారణమని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కె. ప్రీత తెలిపారు. ఇది విమానాల సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్‌లకు పెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు.

పక్షుల ముప్పును నివారించడానికి, ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో భద్రతను పెంచడానికి జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ పలు శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో అక్రమ డంపింగ్ యార్డులను తక్షణమే అడ్డుకోవాలని నిర్ణయించారు.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' పొందకుండా 10 కి.మీ. పరిధిలో ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలను అనుమతించవద్దని రెవెన్యూ, గ్రామ పంచాయతీ, రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (RUDA) అధికారులను జేసీ ఆదేశించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe