...
...
Next Story

వంద రోజుల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలి : విద్యుత్ శాఖ మంత్రి

PM Surya Ghar : వంద రోజుల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ప్రతీ డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల కనెక్షన్లు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు వేసుకోవాలన్నారు.

Published on: Apr 28, 2026, 19:22:35 IST
Advertisement

ఏపీలో వంద రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, నెడ్ క్యాప్ వీసీఎండీ కమలాకర్ బాబు, పీఎం సూర్యఘర్ కాంట్రాక్టర్లు తదితరులు హాజరయ్యారు.

మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష
మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గడువు లోపు పీఎం సూర్యఘర్ పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న మూడు నెలల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేసే విధంగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని హితవు పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో పీఎం సూర్యఘర్ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా గుత్తేదారులు పనుల్లో అలసత్వం ప్రదర్శించకుండా, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు.

ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి అన్నిస్థాయిలలో నిరంతర పర్యవేక్షణ, జవాబుదారీతనం ప్రాముఖ్యతను మంత్రి గొట్టిపాటి రవికుమార్ నొక్కి చెప్పారు. పీఎం సూర్య ఘర్ పథకం విజయవంతమైన అమలు, సమ్మిళిత, సుస్థిర ఇంధన లభ్యత పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను అమలు చేయాలని, కాంట్రాక్టర్లు తమ బాధ్యతలను నిర్లక్ష్యం లేకుండా నిర్వర్తించేలా చూడాలని కూడా మంత్రి అధికారులను ఆదేశించారు. అమలులో ఎలాంటి లోపాలను సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు సమాన ప్రయోజనాలు అందేలా చూస్తూ, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సోలార్ విద్యుత్ సంక్షోభం: భారీ ధరతో కొనుగోలు.. కారుచౌకగా అమ్మకం! డిస్కంల ఖజానాకు 'కరెంట్' షాక్

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe