...
...
Next Story

Andhra University : ఏయూ క్వాంటం టెక్నాలజీ, ఏఐ, సెమీకండక్టర్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌

Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ క్వాంటం టెక్నాలజీ, ఏఐ, సెమీకండక్టర్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు.

Published on: Sep 2, 2026, 14:02:16 IST
Advertisement

ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) పరిశోధన, ఆధునిక సాంకేతిక వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, అలాగే సెమీకండక్టర్ల విభాగాల్లో అత్యాధునిక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు.

ఆంధ్ర యూనివర్సిటీ
ఆంధ్ర యూనివర్సిటీ

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల క్లస్టర్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన 'క్వాంటమ్-ఎన్‌హాన్స్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ఫర్ ఏఐ సిస్టమ్స్' (QUEST-AI) అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.

శతాబ్ది ఉత్సవాల వేడుకలు విజయవంతంగా ముగిసిన అనంతరం, విశ్వవిద్యాలయంలో నాణ్యమైన అభివృద్ధి కార్యకలాపాలపై పూర్తి దృష్టి సారించామని వైస్-ఛాన్సలర్ తెలిపారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు రాబోయే 2-3 ఏళ్లలో విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత మూడు ల్యాబొరేటరీలను నిర్మించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపే విధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేసిన ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. క్వాంటమ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.6,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 'నేషనల్ క్వాంటమ్ మిషన్'ను ప్రారంభించిందని తెలిపారు. భవిష్యత్తు సాంకేతిక పరిణామాలపై ఆయన మాట్లాడుతూ, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ కంప్యూటింగ్‌ను పూర్తిగా భర్తీ చేయదన్నారు. రాబోయే రోజుల్లో ఇవి రెండూ కలిపి పనిచేసే హైబ్రిడ్ మోడల్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.

విశాఖపట్నం నగరం వేగంగా డేటా సెంటర్ల కేంద్రంగా మారుతోందని, ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ఈ డేటా సెంటర్లు ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే ఇలాంటి భారీ డేటా సెంటర్లకు అధిక మొత్తంలో విద్యుత్, నీరు అవసరమవుతాయని, అందుకే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు'సుస్థిరత అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe